శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...

17 Jun, 2016 16:26 IST|Sakshi
శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...

అనారోగ్యంతో ఉన్న ఇద్దరు సైంటిస్టుల ప్రాణాలు కాపాడేందుకు దక్షిణ ధృవానికి  అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా  రెండు చిన్న విమానాలు బయల్దేరాయి. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తున్న సమయంలో ఇటువంటి ప్రయోగం నిజంగా సాహసమేనని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పోలార్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు.

దక్షిణ ధృవానికి వెళ్ళిన ఇద్దరు శాస్త్రవేత్తలకు కొన్ని అనుకోని కారణాలవల్ల అనారోగ్యం సంభవించిందని, అయితే వారిప్రాణాలు రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెల్లీ పాల్కనర్ వివరించారు. ప్రతియేటా 50 మంది శాస్త్రవేత్తల బృదం శీతాకాలానికి ముందే  దక్షిణ ధృవానికి చేరుకుని అక్కడే దాదాపు ఆరునెలలు ఉంటారు. శీతాకాలం సమయంలో అక్కడినుంచీ వారు ఎట్టిపరిస్థితిలో బయటకు వచ్చే అవకాశం ఉండదని, రేడియో కాంట్రాక్టుద్వారా అమెరికా, రష్యాల్లోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనుకోకుండా అనారోగ్యం సంభవించినట్లు సమాచారం అందిందని, ప్రయోగాత్మకంగా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్కనర్ తెలిపారు. అయితే వారికి అందించే మెడికల్ హెల్ప్ కు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం గోప్యతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.

నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ప్రతి సంవత్సరం దక్షిణ ధృవానికి వెళ్ళే ఈ బృందాన్ని ఎంపిక చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము అన్ని నిర్ణయాలు సమతుల్యంగా ఉండేట్లు ప్రయత్నిస్తున్నామని పాల్కనర్ చెప్తున్నారు. ఈ సమయంలో రోగుల పరిస్థితి, విమాన సిబ్బంది భద్రత తో పాటు అముంద్సేన్ స్కాట్ లోని  మిగిలిన 48 మంది శాస్త్రవేత్తల అసవసరాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అయితే 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్స్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండు మాత్రమే జరిగాయని, ఇటువంటివి ఆసాధారణంగా ఉంటాయని, శీతాకాలంలో అత్యంత మంచుతోను, చీకటిగాను ఉన్నసమయంలో అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండదని అంటున్నారు. 1999 లో, ఓ డాక్టర్ తన ఛాతీభాగంలో క్యాన్సర్ కణతిని గుర్తించి, తనకు తానే శస్త్రచికిత్స చేసుకొని, అనంతరం కీమో థెరపీ చేసుకోగా, ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగిసే సమయంలో బృందం వెళ్ళింది. పదేళ్ళ తర్వాత 2001 ఆగస్టులో ఓ మేనేజర్ గుండెపోటుకు గురికాగా, ఓ వైమానిక బృదం రిస్క్ తీసుకొని మరీ అక్కడకు వెళ్ళి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చింది. కాగా ప్రస్తుతం దక్షిణ ధృవంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనారోగ్యం సంభవించడంతో నేషనల్ ఫౌండేషన్ అధికారులు వారిని క్షేమంగా బయటకు తెచ్చే సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు