పాక్‌-ఆఫ్ఘన్‌ సరిహద్దులో ‘బెర్లిన్‌’ గోడ

10 Oct, 2017 20:32 IST|Sakshi

బెర్లిన్‌ వాల్‌ తరహాలో నిర్మాణం

సరిహద్దు ప్రజలను తరలిస్తున్న పాక్‌

అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఆఫ్ఘన్‌

డ్యూరాండ్‌ రేఖ మీదుగా గోడ నిర్మాణం

క్వెట్టా : బెర్లిన్‌ వాల్‌ తరహాలో ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులో గోడ కట్టేందుకు పాకిస్తాన్‌ సమాయత్తమవుతోంది. పాక్‌-ఆఫ్ఘన్‌ సరిహద్దు గ్రామాల్లో అత్యధికంగా ఫష్తూన్‌ తెగకు చెందిన గిరిజనులు నివాసముంటున్నారు. ఆఫ్ఘన్‌, పాకిస్తాన్‌ దేశాలుగా విడిపోయి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ వీరిని పట్టించుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతంలో గోడ నిర్మించి.. తమ దేశం పరిధిలోని ప్రజలను లోపలకు ఆహ్వానించాలనుకుంటోంది. పాక్‌-ఆఫ్ఘన్‌ దేశాల మధ్య 2,500 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతముంది. ఈ సరిహద్దు నుంచి ఉగ్రవాదులు దేశంలోపలకు చోరబడి విధ్వంసాలను సృష్టిస్తున్నారు.. వీరిని అడ్డుకునేందుకు బెర్లిన్‌ వాల్‌ తరహాలోనే గోడను నిర్మిస్తున్నట్లు పాక్‌ ప్రకటించింది. భారత్‌ నుంచి ఆఫ్ఘన్‌ విడిపోయిన తరువాత అంటే బ్రిటీష్‌ కాలంలో 1893లో ఏర్పాటు చేసిన డ్యూరాండ్‌ రేఖ వెంబడి పాక్‌ ఈ గోడను నిర్మిస్తోంది.

పాకిస్తాన్‌ నిర్మించతలపెట్టిన గోడపై ఆఫ్ఘనిస్తాన్‌ అభ్యంతరాలను వ‍్యక్తం చేస్తోంది. విభజిత గ్రామాలుగా పిలుస్తున్న వీటిలో ఫస్తూన్‌ తెగలోని పలువురికి పాస్‌పోర్టులు ఉన్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని చమన్‌ జిల్లాలోని 7 గ్రామాల ప్రజలు తరచూ సరిహద్దులు దాటుతూ ఉంటారు. వీరు పాకిస్తాన్‌ సార్వభౌమాధికారిన్ని అంగీకరించరని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బలూచిస్తాన్‌ ప్రజలను పూర్తిగా పాకిస్తాన్‌ ప్రజలుగానే గుర్తిస్తామని చమన్‌ జిల్లా సరిహద్దు ఫ్రాంటియర్‌ కార్ప్స్‌ పారామిలటరీ ఫోర్స్‌ కమాండర్‌ కల్నల్‌ మహమ్మద్‌ ఉస్మాన్‌ తెలిపారు.

సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు కూడా గోడను నిర్మించడం వల్ల.. ఇటు వైపు ఉన్నది పాకిస్తాన్‌.. అటు వైపు ఉన్నది ఆఫ్ఘనిస్తాన్‌ అని తేలిగ్గా గుర్తించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. సరిహద్దుల్లో గోడ నిర్మించాలని 1989నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా.. అది ఇప్పటికి సాకారమయిందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు