'చనిపోలేదు.. త్వరలోనే ఆడియో వినిపిస్తాం'

6 Dec, 2015 09:39 IST|Sakshi
'చనిపోలేదు.. త్వరలోనే ఆడియో వినిపిస్తాం'

ఇస్లామాబాద్: తమ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్ చనిపోయాడని వస్తున్న వార్తలు అవాస్తవాలని అఫ్గనిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించింది. త్వరలోనే ఆయన ఆడియోను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అసలు ఆయనపై ఎలాంటికాల్పులు జరగలేదని, ఆయనకు ఎలాంటి గాయాలు అవలేదని ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుందని తాలిబన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

'మా చీఫ్ ముల్లా అఖ్తర్ సందేశం మాకు అందించింది. దానిని త్వరలోనే మేం మీకు విడుదల చేస్తాం. శత్రువులు మానసికంగా దెబ్బకొట్టేందుకు మా నేత చనిపోయాడని ప్రకటించారు. అతడు చనిపోయాడా బతికున్నాడా అనేది త్వరలోనే మీకు తెలుస్తుంది' అంటూ తాలిబన్ అధికార ప్రతినిథి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. పాకిస్థాన్లో చోటుచేసుకున్న గన్ ఫైట్లో అఖ్తర్ చనిపోయినట్లు అప్గనిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని నాడే తాలిబన్లు కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు