వైరల్‌ అవుతున్న అమ్మ పరీక్ష ఫొటో

21 Mar, 2018 16:09 IST|Sakshi

ఓ అమ్మ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తోంది. సోషల్‌ మీడియాలో దూసుకెళుతూ వైరల్‌ అవుతోంది. ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరు కాసేపు రెప్పవాల్చకుండా అలా చూస్తుండి పోతున్నారు. ఇంతకు ఏముంది ఆ ఫొటోలో? అంతగా ఆకర్షిస్తున్న ఆ అమ్మ ఎవరు? అంటే.. అప్ఘనిస్థాన్‌లోని డేకుండా ప్రావిన్స్‌లోగల నిల్లీ అనే నగరంలో నాసిర్‌ఖోస్రా హైయర్‌ ఎడ్యుకేషన్‌ అనే ఇన్‌స్టిట్యూట్‌ ఉంది. అందులో ఓ సోషల్‌ సైన్స్‌ కోర్సుకోసం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జహాన్‌ తాబ్‌ (25) అనే మహిళ హాజరయ్యారు. ఆమె రెండు నెలల పసిబిడ్డను తీసుకొని ఆ పరీక్షకు వచ్చారు.

అయితే, పరీక్ష రాసే సమయంలో బిడ్డ ఏడవడంతో ఆ పాపను ఒడిలోకి తీసుకొని, కింద కూర్చుని ఓపక్క ఆ పాప సంరక్షణ చూస్తూనే తాను పరీక్ష రాయడం మొదలుపెట్టింది. బిడ్డకు పాలు పడుతూ, తను రాసిన పేపర్‌ను చెక్‌ చేసుకుంటూ ఉండగా ఆ దృశ్యం అక్కడ ఉన్నవారిని ముఖ్యంగా ఆ పరీక్షకు ఇన్విజిలేటర్‌గా ఉన్న యాయా ఇర్ఫాన్‌ అనే లెక్చరర్‌ను అమితంగా ఆకర్షించింది. దీంతో ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధించి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయగా ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె ఒరిజినల్‌ ఫొటో పోస్ట్‌ను తొలగించినప్పటికీ భారీ మొత్తంగా షేర్‌లు అవడంతో ఆ ఫొటో ఏదో ఒక చోట దర్శనం ఇస్తూ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు