కాబూల్: భారత్.. అఫ్ఘనిస్తాన్ పతనాన్ని కోరుకుంటోందన్న ఉగ్రవాద సంస్థ తాలిబన్ వ్యాఖ్యలను అఫ్ఘన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. అఫ్ఘన్లో శాంతియుత వాతావరణానికి భారత్ నిరంతరం కృషి చేస్తుందని అఫ్ఘన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి గ్రాన్ హెవాడ్ పేర్కొన్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో అన్ని రంగాలలో మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తున్నాయని అన్నారు. అఫ్ఘన్ పునర్నిర్మాణానికి భారత్ సహకారం మరువలేనిదని హెవాడ్ గుర్తు చేశారు.
ప్రపంచ దేశాలతో అఫ్ఘన్ ప్రభుత్వం చొరవ చూపుతున్న ప్రస్తుత తరుణంలో తాలిబన్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశానికి తీవ్ర నష్టమని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు ఖాలిద్ సాదత్ పేర్కొన్నారు. దేశానికి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసే హక్కు తాలిబన్లకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. భారత్ ఆఫ్గన్ దేశాల శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ తాలిబాన్లను ఉసిగొల్పుతోందని సాదత్ ఆరోపించారు.