హాంకాంగ్: అత్యాధునిక నిర్మాణాలు, లైట్ హౌస్లు, జైళ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రాడార్ వ్యవస్థ ఇవన్నీ అన్ని నగరాల్లోనూ ఉంటాయి. కానీ, ఒక ద్వీపంలో ఇవ్వని ఉంటాయని ఊహించగలమా?, కానీ చైనా ఓ ద్వీపంలో వీటన్నింటినీ నిర్మిస్తోంది. దక్షిణ సముద్రంలో ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తోంది. ఇందుకు ప్రధాన అవసరమైన విద్యుత్ కోసం ఓ కదిలే న్యూక్లియర్ పవర్ ప్లాంటు నిర్మించాలనుకుంటోంది చైనా.
ఈ కదిలే న్యూక్లియర్ ప్లాంటు విద్యుత్ అవసరాలకే కాకుండా ఆయిల్ సంస్థలకు కూడా ఉపయోగించుకునేలా చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్(సీఎస్బీఐసీ) రూపొందించబోతున్నదని ఆ దేశ పత్రిక గ్లోబల్ టైమ్స్ శుక్రవారం ప్రచురించింది. ఇప్పటికే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియర్ పవర్ ప్లాంటులను నిర్మిస్తున్న చైనా.. కదిలే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను నిర్మించడం వల్ల మారిటైమ్లో ప్రచండ శక్తిగా ఎదగనుంది. 2020 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చూస్తున్నట్టు ఆ దేశ అటామిక్ ఎనర్జీ అథారిటీ ప్రకటించింది.
కదిలే న్యూక్లియర్ రియాక్టర్లను తయారుచేయడం కొత్తేం కాదు.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పనామా కాలువ జోన్లో విద్యుత్తును అందించడానికి అమెరికా ఆర్మీ ఇలాంటి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ను అమర్చింది. ఏదైనా ప్రమాదం జరిగి న్యూక్లియర్ రియాక్టర్ నీటిలో మునిగితే ఆ నీటితో పాటు సమీపంలోని ప్రాంతాలు రేడియోయాక్టివ్ వాయువులతో ప్రాణాపాయకరంగా మారతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 1970ల్లో అట్లాంటిక్ తీరంలో కదిలే న్యూక్లియర్ రియాక్టర్లను తయారుచేద్దామనుకున్న అమెరికా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అయితే, తుఫాన్లు ఎక్కువగా వచ్చే దక్షిణ చైనా సముద్రంలో ఈ కదిలే అణు రియాక్టర్లు వాటిని ఎలా తట్టుకుని నిలబడాతాయన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఇందుకోసం చైనా జాతీయ న్యూక్లియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కసరత్తులు చేస్తున్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.