అలారంతో పిల్లల్ని సులభంగా కాపాడవచ్చు!

12 Nov, 2019 13:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టొరంటో : షాపింగ్‌కు వెళ్లేటప్పుడు పిల్లలు, ఇతర పెంపుడు జంతువులను కార్లలో తీసుకెళ్లడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. అయితే లోపలికి వెళ్లి తొందరగానే వచ్చేస్తాంలే అనే ఆలోచనతో చిన్నారులను, పెంపుడు జంతువులను కొంతమంది కార్లలోనే వదిలివెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి కార్లు ఆటోమెటిక్‌ లాక్‌ అయి ఊపిరి ఆడక ప్రాణాలు పోయే పరిస్థితికి దారి తీస్తుంది. ఇటువంటి ప్రమాదాల బారి నుంచి వారిని రక్షించడానికి టొరంటోకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఒక కొత్త సెన్సార్‌ను కనుగొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ- కృత్రిమ మేథ)తో రూపొందిన పరికరానికి రాడార్‌ను జోడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఎంతో ప్రయోజనకరమైన ఈ పరికరం మూడు సెంటీమీటర్‌ డయామీటర్‌ ప్రేమ్‌గా అరచేతిలో ఇమిడిపోయేంతగా ఉంటుంది. దీనిని వాహన వెనుక అద్దం(రియర్‌ వ్యూ మిర్రర్‌) లేదా పైకప్పుకు అతికించవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఎప్పుడైనా వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులు చిక్కుకుపోతే.. రాడార్‌ సిగ్నల్స్‌.. వారిని తాకి పరావర్తనం చెందినపుడు.. ఏఐ సిస్టమ్‌ ద్వారా సంకేతాలు ఏర్పడి అలారం మోగుతుంది. కాగా దీనిని 2020 చివరినాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్తవేత్తలు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కు రాడార్‌ టెక్నాలజీని జోడించి రూపొందించిన పరికరం ద్వారా వాహనాల్లో చిక్కుకున్న పిల్లల్ని, పెంపుడు జంతువులను కచ్చితంగా కాపాడవచ్చని కెనెడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూకి చెందిన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు