ఆఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం!

27 Jan, 2020 16:19 IST|Sakshi

కాబూల్‌: ఆఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న సెంట్రల్‌ ఘాంజీ ప్రావిన్స్‌లో సోమవారం ఘటన జరిగింది. ఆఫ్గనిస్తాన్‌కు చెందిన ఏరియానా ఆఫ్గాన్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం సోమవారం 1:40 గంటల సమయంలో కుప్పకూలినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా.. ఆఫ్గనిస్తాన్‌ జాతీయ విమాన సంస్థ అయిన అరియానా ఎయిర్‌లైన్స్‌ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. తమ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని పేర్కొంది. 

కాగా హిందూకుష్‌ పర్వతాల పాదాల చెంతనున్న ఘాంజీ ప్రావిన్స్‌లో శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇక 2005లో ఇదే ప్రాంతంలో మంచు కారణంగా ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అంతేకాదు అనేకమార్లు సైన్యం విమానాలు కూడా కూలిపోయాయి. కాగా ప్రస్తుత విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది.
 

>
మరిన్ని వార్తలు