మనిషి పాపం.. వాటికి శాపం..

11 May, 2018 17:29 IST|Sakshi
ప్రాణాలు విడిచిన జీవులు

వాషింగ్టన్‌ : మనిషి సృష్టిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల కాలుష్యం జనావాసంలోని వారినే కాకుండా.. మనిషికి దూరంగా బతుకుతున్న మూగ జీవాల ప్రాణాలను కూడా తీస్తోంది. గత కొద్ది నెలలుగా పసిఫిక్‌ సముద్ర తీరంలోని మిడ్‌వే ఐలాండ్‌లో కొన్ని వేల పక్షులు ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా ప్రాణాలు విడిచాయి. ఈ ఐలాండ్‌లో ఎక్కువగా ఆల్బట్రాస్‌ జాతి పక్షులు జీవిస్తుంటాయి. తీరాల వెంట చేపలను వేటాడి తింటూ బతికేస్తుంటాయి.

కానీ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ప్లాస్లిక్‌ వ్యర్థాలను పోల్చుకోలేక వాటిని చేపలుగా భావించి అవి తినటమే కాకుండా వాటి పిల్లలకు కూడా తినిపిస్తున్నాయి. దీంతో తిన్న వ్యర్థాలను అరాయించుకోలేక భారీ సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. అమెరికా ఫోటోగ్రాఫర్‌ క్రిస్‌ జార్డన్‌ హోప్స్‌ తీసిన ఫోటోలు ప్రజల్ని కదిలించాయి.

చనిపోయిన పక్షి కడుపులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్న ఆ చిత్రంతో అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఫొటో గ్రాఫర్‌ జార్డన్‌ మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్‌ వస్తువులను మనం ఒకసారి వాడేసిన తర్వాత పడేస్తున్నాం. అవి భూమిలో కలిసిపోవడం చాలా కష్టం. ప్లాస్టిక్‌ను నివారించడం ఒక్కరితో అయ్యే పని కాదు. మార్పు తీసుకురావాలంటే అందరిలోనూ చైతన్యం రావాలి’ అని అన్నారు. ప్రతి మనిషి ఒక రోజులో 130 అతిచిన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను శ్వాసిస్తున్నాడని ఓ పరిశోధనలో తేలింది.

మరిన్ని వార్తలు