కరోనాపై పోరాటానికి 103 కోట్లు విరాళమిచ్చిన జాక్‌ మా

31 Jan, 2020 13:14 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలోని వుహన్‌ నగరంలో మొదలైన కరోనా వైరస్  చైనీయుల ప్రాణాలను కబలిస్తోంది. కరోనా వైరస్‌ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు బాధితులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తూనే.. మరోవైపు కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు సైతం తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్‌కు పోరాటానికి తన వంతు సాయంగా ఈ విరాళం అందజేశారు.

దీంతో పాటు టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) విలువైన వస్తువులతో పాటు మ్యాపింగ్, డేటా సర్వీసులను అందిస్తున్నారు. దీదీ చుక్సింగ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ తమ వాహనాల ద్వారా మెడికల్ వర్కర్స్, పేషెంట్లకు ఉచిత రవాణా సాయం చేస్తోంది. ఇక డైడు, టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వంటి కంపెనీలు సైతం తమకు తోచిన సాయం అందిస్తున్నాయి. కాగా, చైనాలో కరోనావైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 213 మంది మృతి చెందగా, 7వేల మందికి పైగా కరోనా బారీన పడి చికిత్స తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు