పుస్తక ప్రియులకు శుభవార్త..!

29 Aug, 2016 18:35 IST|Sakshi
పుస్తక ప్రియులకు శుభవార్త..!

బెంగళూరుః తెలుగు పుస్తక ప్రియులకు శుభవార్త. లైబ్రరీలకు, దుకాణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని కావలసిన తెలుగు పుస్తకాలు వెతుక్కొని కొనుక్కొనేందుకు వీలుగా ఈ కామర్స్ పోర్టల్.. ఆమెజాన్ డాట్ ఇన్ ఆన్ లైన్ తెలుగు పుస్తక దుకాణాన్ని తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 10,000 ప్రముఖ పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

త్వరలో ఆన్ లైన్ తెలుగు బుక్ స్టోర్ ను ప్రయోగాత్మకంగా  ప్రారంభించనున్నట్లు అమెజోన్ డాట్ ఇన్ ప్రకటించింది. సాహిత్యం, ఫిక్షన్, జీవిత చరిత్రలు వంటి వాటిలో ఎంపిక చేసిన ప్రముఖ పుస్తకాలతోపాటు బిజినెస్, ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్, వంటలు, పిల్లల పుస్తకాలను కూడా తన స్టోర్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఎంచుకున్నఆయా పుస్తకాలను తమ ఇంటివద్దకే చేర్చే ప్రత్యేక సదుపాయాన్ని కూడా సంస్థ కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

బీవీ పట్టాభిరామ్, రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనా రాణి, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖ రచయితలు రాసి, ప్రశంసలు పొందిన పుస్తకాలతోపాటు..  ప్రముఖ ప్రచురణకర్తల వద్ద ఎక్కువగా అమ్ముడు పోయే పుస్తకాలను సైతం తమ ఆన్ లైన్ స్టోర్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అలాగే రీడర్లు ఇంగ్లీషులో బాగా అమ్ముడు పోయి, తెలుగులోకి అనువదించబడిన 'ది సీక్రెట్ అండ్ సియోన్ ఆఫ్ ఇక్ష్వాకు' వంటివి కూడా తమ స్టోర్ లో ఉంచనున్నట్లు అమెజోన్ తెలిపింది.

మరిన్ని వార్తలు