ప్రపంచ మొబైల్‌ కాంగ్రెస్‌కు అమెజాన్‌ ‘నో’

10 Feb, 2020 17:29 IST|Sakshi

న్యూఢిల్లీ : స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ‘మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌–2020’ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా అమెరికా దిగ్గజ ఆన్‌లైన సంస్థ అమెజాన్, జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ సంస్థలు తాజాగా సోమవారం ప్రకటించాయి. ఇప్పటికే ఈ కాంగ్రెస్‌కు హాజరు కావడం లేదని దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, స్విడ్జర్లాండ్‌కు చెందిన ఎరిక్‌సన్, అమెరికాకు చెందిన చిప్‌ కంపెనీ ఎన్వీడియా కంపెనీలు ఇదిరవరకే ప్రకటించాయి. 

అందరి భయం ఒక్కటే. కరోనా వైరస్‌. ఇప్పటికే స్పెయిన్‌లో నలుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చిన చైనాలో వుహాన్‌ పట్టణంలో ఎక్కువ మంది స్పెయిన్‌ ప్రజలు ఉండడం, వైరస్‌ గురించి తెలియగానే వారంతా స్పెయిన్‌ వచ్చేయడంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ప్రపంచ మొబైల్‌ సమ్మేళనం నిర్వాహకులు వుహాన్‌ రాజధానిగా ఉన్న చైనాలోని హుబీ రాష్ట్రం నుంచి ఏ కంపెనీ కూడా సమ్మేళనంకు రాకుండా ముందుగానే నిషేధం విధించింది. ఐదు దిగ్జజ కంపెనీలు సమ్మేళనంకు రాకపోయినా తాము మాత్రం సమ్మేళనాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు