ఇస్లామాబాద్ : అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్కు షాకిచ్చింది. పాకిస్తాన్ పౌరులకు సంబంధించి వివిధ కేటగిరీ వీసాల కాలపరిమితిని తగ్గించింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్లోని అమెరికా రాయబారి వెల్లడించారు. వర్క్, మిషనరీస్కు సంబంధించిన వీసాల గడువును ఐదేళ్ల నుంచి ఏడాదికి కుదించింది. జర్నలిస్టుల వీసాల గడువును కూడా ఐదేళ్ల నుంచి మూడు నెలలకు తగ్గించింది. వీసా అప్లికేషన్ రేట్లను సైతం అమాంతం పెంచేసింది. పాక్ పౌరులకు వీసా అప్లికేషన్ రుసుమును కూడా 160 డాలర్ల నుంచి 192 డాలర్లకు పెంచింది. అయితే, వర్తక, టూరిజం, స్టూడెంట్ వీసాల కాలపరిమితి మాత్రం ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇటీవల అమెరికా పౌరులను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ తమ దేశ వీసా పాలసీలో సవరణలు చేసింది. ఈ నేపథ్యంలోనే దానికి ప్రతిగా అమెరికా కూడా పాక్కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.