అరెస్టయిన భారతీయ విద్యార్థులకు ఊరట 

14 Feb, 2019 03:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో ఫార్మింగ్‌టన్‌ ఫేక్‌ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన విద్యార్థులకు ఊరట లభించింది. ఈనెల 26లోగా వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అక్కడి కోర్టు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆటా–తెలంగాణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన 16 మంది విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది. ఫార్మింగ్‌టన్‌ నకిలీ వర్సిటీ కేసులో 20 మంది భారతీయ విద్యార్థులు అరెస్టయ్యారు. కేలహోన్‌ కౌంటీ జైలులో 12మంది, మన్రో కౌంటీ జైలులో 8మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ (ఆటా–తెలంగాణ) అండగా నిలిచింది. విద్యార్థుల తరపున వాదించేందుకు అటార్నీలను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో మంగళవారం తుది విచారణ జరిగింది.

అనంతరం.. అరెస్టయిన వీరికి స్వచ్ఛందంగా దేశం వదిలి వెళ్లేందుకు అవకాశాన్ని ఇచ్చింది. 20 మందిలో ముగ్గురు ముందుగానే.. వాలంటరీ డిపార్చర్‌ అనుమతితో వెళ్లిపోయారు. 17 మందిలో 15 మందికి కోర్టు తాజాగా వాలంటరీ డిపార్చర్‌ అవకాశం కల్పించింది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి అక్కడి ప్రభుత్వం రిమూవల్‌ కింద వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా.. మరో విద్యార్థి అమెరికన్‌ సిటిజన్‌ను పెళ్లి చేసుకోవడంతో బెయిల్‌ బాండ్‌ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. ఈ 16 మంది విద్యార్థులు కోర్టు ఆదేశాలతో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరి తిరుగు ప్రయణానికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో సహకరించాలని ఇమిగ్రేషన్‌ అధికారులను ఆటా ప్రతినిధులు కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు