‘యాంటీ బయాటిక్‌’ బాంబు!

6 Feb, 2018 02:21 IST|Sakshi

భారత్‌లో 63% డ్రగ్స్‌ అమ్మకాలకు అనుమతి లేదు: లండన్‌ పరిశోధకులు

లండన్‌: బహుళజాతి ఫార్మాసూటికల్‌ సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే మిలియన్ల కొద్దీ యాంటీ బయాటిక్స్‌ను భారత్‌లో అమ్ముతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. వీటిని విచ్చలవిడిగా వాడటం ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు యాంటి బయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని బ్రిటన్‌లోని క్వీన్‌ మేరీ వర్సిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు తెలిపారు. బహుళజాతి ఫార్మా కంపెనీలు భారత్‌లో ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్‌ను ఉత్పత్తి చేయకుండా నిలువరించడంలో ఔషధ నియంత్రణ సంస్థలు విఫలమయ్యాయన్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2012 వరకూ భారత ఔషధ నియంత్రణ సంస్థ రికార్డులతో పాటు దేశవ్యాప్తంగా యాంటీ బయాటిక్స్‌ అమ్మకాల వివరాలను సేకరించినట్లు పరిశోధనలో పాల్గొన్న మెక్‌గెట్టిగన్‌ తెలిపారు. భారత్‌లో 118 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్స్‌ (ఎఫ్‌డీసీ)ను అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్‌లలో కేవలం ఐదుగానే ఉందన్నారు. మొత్తం 118 రకాల ఎఫ్‌డీసీల్లో 63 శాతం డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండానే భారత్‌లో అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా మొత్తం 86 సింగిల్‌ డ్రగ్‌ ఫార్ములేషన్‌(ఎస్‌డీఎఫ్‌)ల్లో 93 శాతం మందులకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉందన్నారు.

మరిన్ని వార్తలు