పాక్‌ సైనిక కార్యాలయంపై భారత్‌ కాల్పులు

30 Oct, 2018 04:17 IST|Sakshi
భారత సైనికులు కాల్పులు జరిపిన ప్రాంతం

జమ్మూ: నియంత్రణ రేఖ దగ్గర్లో ఉన్న పాకిస్తాన్‌ సైనిక పాలక ప్రధాన కార్యాలయంపై భారత్‌ కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 23న జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, ఝల్లాస్‌ల్లో పాకిస్తాన్‌ ఆర్మీ జరిపిన కాల్పులకు ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా కాల్పులకు దిగిందన్నారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఖ్యురత్త, సమానీ ప్రాంతాలపై కూడా భారత జవాన్లు దాడులు జరిపారనీ, పీవోకేలో పొగలు వస్తున్నట్లు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా చెప్పారని ఓ అధికారి వెల్లడించారు. పాకిస్తానీ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి పొగ వస్తున్నట్లు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్‌ ఎంత రెచ్చగొట్టినా భారత్‌ ఇన్నాళ్లూ నిగ్రహాన్ని పాటించిందనీ, తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామనేందుకు తాజా కాల్పులు పాక్‌కు గట్టి సంకేతమని తెలిపారు. పీవోకేలోని పౌర ప్రాంతాలపై ఆర్మీ కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు