ఈ పైపులోని గుడ్లగూబల ఫొటో.. పదేళ్ల బాలుడి క్లిక్‌!

21 Oct, 2018 01:29 IST|Sakshi

వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌..
ఈ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌..

లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్‌ హిస్టరీ మ్యూజియం ఈ పోటీలను ఏటా నిర్వహిస్తోంది. వివిధ విభాగాల్లో అవార్డులను ఇస్తారు. వీటిని గెలవడాన్ని వన్యప్రాణి ఛాయాచిత్రకారులు గొప్ప విషయంగా భావిస్తారు. అలాంటి పురస్కారాన్ని మన దేశానికి చెందిన బుడతడు గెలుచుకున్నాడు. 2018 పోటీకి సంబంధించి వివిధ విభాగాల కోసం 95 దేశాల నుంచి 45 వేల ఎంట్రీలు వచ్చాయి. 10 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్నవారి కేటగిరీలో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పురస్కారాన్ని పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన అర్షదీప్‌ సింగ్‌(10) గెలుచుకున్నాడు. ఇతడి తండ్రి రణ్‌దీప్‌ సింగ్‌ కూడా ఫొటోగ్రాఫరే. దీంతో సహజంగానే ఆసక్తి పెరిగింది. 6 ఏళ్ల వయసు నుంచే ఫొటోలు తీస్తున్నాడు. గతంలో జూనియర్‌ ఏసియన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పురస్కారాన్ని కూడా గెలుచుకున్నాడు. పలు అంతర్జాతీయ మ్యాగజీన్లలో ఇతడు తీసిన చిత్రాలు ప్రచురితమయ్యాయి. ఈ పైపులోని గుడ్లగూబల ఫొటోను కపుర్తలాలోనే తీశాడు. తన తండ్రితో పాటు కారులో వెళ్తున్నప్పుడు దీన్ని గమనించాడట. సాధారణంగా ఉదయం పూట గుడ్లగూబలు కనిపించవు. దీంతో కారును ఆపమని చెప్పాడట. డోరు అద్దం కిందకు దింపి.. అక్కడ్నుంచి ఫొటో క్లిక్‌మనిపించాడట.

   అర్షదీప్‌ సింగ్‌కు జూనియర్‌ ఏసియన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఫొటో

మరిన్ని వార్తలు