అరుణగ్రహంపై మీథేన్, కర్బన అణువులు!

18 Dec, 2014 04:03 IST|Sakshi

వాషింగ్టన్: భూమిపై 380 కోట్ల ఏళ్ల క్రితం జీవం ఆవిర్భవించిందని భావిస్తున్నట్లే అంగారకుడిపైనా అదే సమయంలో సరస్సులు ఉండేవని, వాటిలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నివసించి ఉండవచ్చని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు తొలిసారిగా కచ్చితమైన ఆధారాలను అంగారకుడిపై ఉన్న క్యూరియాసిటీ రోవర్  గుర్తించిందని వారు వెల్లడించారు.

మార్స్‌పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో 2012, ఆగస్టులో దిగిన ఈ రోవర్ అక్కడ ఓ మడ్‌స్టోన్ శిలకు రంధ్రం చేసి దాని పొడిని ‘శాంపిల్ అనలైసిస్ ఎట్ మార్స్’ పరికరంతో పరీక్షించింది. ఆ ఫలితాలను విశ్లేషించగా.. గేల్‌క్రేటర్‌లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సీజన్‌లతో కూడిన సేంద్రియ అణువులు, క్లోరిన్ అణువులు, క్లోరోబెంజీన్, డైక్లోరోఆల్కేన్ రసాయనాలూ ఉన్నట్లు తేలిందని వారు ప్రకటించారు.

మార్స్ వాతావరణంలో మీథేన్ వాయువు ఉనికినీ క్యూరియాసిటీ గుర్తించిందన్నారు. అయితే కర్బన అణువులు, మీథేన్ కొన్ని పరిస్థితుల్లో రసాయనిక చర్యల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున, ఇవి సూక్ష్మజీవుల చర్యల వల్లే ఏర్పడ్డాయనేది చెప్పలేమంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు