‘దేవుడు ఆదేశించాడు.. నేను పాటించాను’

8 Sep, 2018 19:03 IST|Sakshi
నిందితుడు ఒలీవిరా

బ్రెజీలియా : ఎన్నికల ప్రచారంలో భాగంగా మినాస్‌ గ్రేస్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్న బ్రెజిల్‌ అధ్యక్ష అభ్యర్థి జేర్‌ బోల్సోనారోపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మినాస్‌ గ్రేస్‌కు చెందిన అడెలియో డీ ఒలివిరాగా నిందితుడిని గుర్తించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల(అక్టోబర్‌)లో పోలింగ్‌ జరగనున్న క్రమంలో జేర్‌పై దాడి జరగడంతో.. ఇది ప్రత్యర్థుల పనేనంటూ సోషల్‌ లిబరల్‌ పార్టీ ఆరోపించింది. కాగా తన చర్య వెనుక దేవుడు తప్ప ఎవరూ లేరని, ఆయన ఆదేశించడం వల్లే తానిలా చేశానంటూ ఒలివిరా పేర్కొన్నాడు. అతడి తరపు లాయర్‌ మాట్లాడుతూ...‘ ఒలివిరా ఆవేశంలో దాడి చేశాడని, రాజకీయ, మత పరమైన నాయకులకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. ఒలివిరా మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఇలా చేసి ఉండవచ్చని పేర్కొన్నాడు.      

బాగానే ఉన్నారు.. ఆందోళన వద్దు
ఒలీవిరా దాడిలో జేర్‌ తీవ్రంగా గాయపడ్డారు. కత్తితో కడుపులో పొడవడంతో పెద్దపేగుకు తీవ్ర గాయమైందని వైద్యులు పేర్కొన్నారు. 40 శాతం రక్తం పోయిందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే జేర్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఆయన కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జేర్‌ కోలుకుంటున్నారని,  ఆయనకు విజయాన్ని బహుమానంగా ఇవ్వాలంటూ కోరారు. కాగా గతంలో బ్రెజిల్‌ మిలిటరీ అధికారిగా పనిచేసిన జేర్‌కు వివాదాస్పద నేతగా పేరుంది. 1964- 85 మధ్య బ్రెజిల్‌లో సైనిక నియంత పాలన కొనసాగడాన్ని ఆయన బహిరంగంగానే సమర్థించేవారు. అదే విధంగా పలుమార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జేర్‌పై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఒలీవిరా ఫేస్‌బుక్‌ పోస్టుల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు