మంటల్లో పబ్‌కు బీరు సరఫరా!

10 Jan, 2020 20:59 IST|Sakshi

ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా పొదలు తగలబడుతూ మంటలు చుట్టుముట్టిన విక్టోరియా పట్టణాల్లో మల్లకూట ఒకటి. ఆ నగరం నుంచి బుధవారం నాడే వేలాది మంది ప్రజలను, వారితోపాటు ఆహార పదార్థాలను తీసుకొని ఓ నౌకా దళం సురక్షిత ప్రాంతానికి తరలి పోయింది. అయినా నాలుగు వేల మంది ప్రజలు పట్టణంలో మిగిలిపోయారు. ఆ పట్టణానికి వచ్చి పోయే దారులను అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. 

పట్టణంలోని హోటల్‌ మోటల్‌లోని పబ్‌లో బీర్లు అయిపోయాయి. అప్పటికే మంచినీటి కొరతతో బాధ పడుతున్న పట్టణ ప్రజలు బీర్లకు ఎగబడడంతో బీర్లు త్వరగా అయిపోయాయి. రెగ్యులర్‌ కోటా రావడానికి సమయం పడుతుంది. దాంతో పబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ఫిలిపోవిక్‌ మల్లకూట కౌంటీ అగ్నిమాపక దళాధికారికి ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. ఆయన ఈ విషయాన్ని సహాయక చర్యల్లో నిమగ్నమైన సైనిక దళానికి చేరవేయడంతో ఆ సైనిక దళం కార్ల్‌టాన్, యునైటెడ్‌ బ్రేవరీస్‌కు చెందిన మూడు వేల లీటర్ల బీర్లను తీసుకొచ్చి పబ్‌కు సరఫరా చేసింది. అందుకు హోటల్‌ యజామానితోపాటు వినియోగదారులు కూడా సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

భూగర్భ జలాలు బాగా తగ్గిపోయి భూ ఉపరితం బాగా వేడెక్కిపోవడంతో ఆస్ట్రేలియాలో అడవులు, పొదలు తగులబడుతున్న విషయం తెల్సిందే. దీని వల్ల ఇప్పటికే కొన్ని కోట్ల జంతువులు మత్యువాత పడ్డాయి. నీటిని రక్షించుకోవడంలో భాగంగా లక్షకుపైగా ఒంటెలను కాల్చివేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. 

చదవండి:

ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఆగని కార్చిచ్చు.. ఎటుచూసిన కళేబరాలే

బీచ్లలో చిక్కుకున్న వేల మంది

మరిన్ని వార్తలు