టాయిలెట్‌ పేపర్‌ కోసం కొట్టుకున్న మహిళలు

8 Mar, 2020 14:33 IST|Sakshi

సిడ్నీ : కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19)‌.. తాజాగా ఇద్దరు మహిళల మధ్య గొడవలు కూడా సృష్టించింది. అంతే కాదు వారిని జైలుపాలు కూడా చేసింది. కరోనావైరస్‌ గొడవలు ఎలా సృష్టింస్తుందని అనుకుంటున్నారా..? అది ప్రత్యేక్షంగా గొడవలు పెట్టించలేదు కానీ.., దాని కారణంగా ఇద్దరు అస్ట్రేలియా మహిళలు గొడవపడి అరెస్టయ్యారు. కరోనావైరస్ భయంతో టాయిలెట్ పేపర్‌ను కొనుగోలు చేసే విషయంలో గొడవపడిన ఇద్దరు మహిళలను అస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిద్దర్నీ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు.
(చదవండి : ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా)

అసలీ సమస్యంతా ఎక్కడొచ్చిందంటే... ఆస్ట్రేలియా ప్రభుత్వం టాయిలెట్ పేపర్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. చైనాలో కరోనావైరస్‌ విజృభించడంతో చాలా వస్తువుల దిగుమతులు తగ్గిపోయాయి. టాయిలెట్ పేపర్ల దిగుమతి మాత్రం తగ్గలేదు. కానీ... దిగుమతి తగ్గవచ్చనే భయంతో... సూపర్ మార్కెట్లలో ఒక్కో వ్యక్తికీ... ఒక ప్యాకెట్ మాత్రమే అమ్ముతున్నారు. ఐతే... ప్రజలు మాత్రం మున్ముందు టాయిలెట్‌ పేపర్లు దొరుకుతాయో లేదో అనే భయంతో పెద్ద ఎత్తున కొని ఇళ్లలో గుట్టలుగా పెట్టేసుకుంటున్నారు.. దీంతో అస్ట్రేలియాలో టాయిలెట్‌ పేపర్ల కొరత ఏర్పడింది. 

ఇలాంటి పరిస్థితుల్లో ఓ సూపర్ మార్కెట్‌లో ఓ యువతి(23) తన ట్రాలీ నిండా... టాయిలెట్ పేపర్ బండిల్స్ ప్యాకెట్లను నింపేసుకుంది. అందులోంచీ తనకు ఓ ప్యాకెట్ ఇమ్మని 60 ఏళ్ల మహిళ అడిగింది. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. సమచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 70కి చేరింది. ఇటీవల ఈ వైరస్‌ సోకి ఓ 80 ఏళ్ల వ్యక్తి మృతిచెందడంతో.. అక్కడ మృతుల సంఖ్య 3కి చేరింది.

మరిన్ని వార్తలు