యాంటీ- పారాసైట్‌ డ్రగ్‌తో అద్భుత ఫలితాలు!?

22 May, 2020 14:30 IST|Sakshi

నమ్మశక్యం కాని ఫలితాలు పొందాం: బంగ్లాదేశ్‌ వైద్య నిపుణులు

ఢాకా: యాంటీ- పారాసైట్‌ డ్రగ్‌, ప్రతిరక్షకాల కాంబినేషన్‌తో మహమ్మారి కరోనాను కట్టడి చేయవచ్చంటున్నారు బంగ్లాదేశ్‌ వైద్య నిపుణులు. కరోనా పేషెంట్ల చికిత్సలో భాగంగా ఈ కాంబినేషన్‌ను ఉపయోగించినపుడు అద్బుతమైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. అంతేగాక వీటితో రోగులకు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవని పేర్కొన్నారు. ఈ విషయం గురించి బంగ్లాదేశ్‌ మెడికల్‌ హాస్పిటల్‌ వైద్య విభాగం అధిపతి డాక్టర్‌ మహ్మద్‌ తారిక్‌ ఆలం మాట్లాడుతూ.. డజన్ల సంఖ్యలో కోవిడ్‌ రోగులకు యాంటీ పారాసైట్‌ డ్రగ్‌, యాంటిబయోటిక్‌లు ఇచ్చామని.. ఈ క్రమంలో వారు నాలుగు రోజుల్లోనే కోలుకున్నారని చెప్పుకొచ్చారు. తల పేన్లు, గజ్జి, దురద నుంచి విముక్తి పొందేందుకు వాడే డీ- వార్మింగ్‌(పురుగులను నిర్మూలించే ప్రక్రియ) చికిత్స విధానంతో నమ్మకం శక్యం కాని ఫలితాలు పొందామని తెలిపారు. (సెప్టెంబర్‌లో వ్యాక్సిన్‌ సరఫరా షురూ)

ఇలా దాదాపు 60 పేషెంట్లకు ఈ మెడికేషన్‌ అందించగా.. వారంతా కోలుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాగా పరాన్నజీవులను అంతమొందించే ఇవర్‌మెక్టిన్‌ ప్రక్రియ ద్వారా కణజాలాల్లో కరోనా వైరస్‌ అభివృద్ధి చెందకుండా.. దాని ప్రభావాన్ని కట్టడి చేయవచ్చని స్థానిక వార్తా సంస్థ గత నెలలో ఓ అధ్యయానికి సంబంధించిన కథనాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. ఇక మానవాళి మనుగడకు సవాల్‌ విసిరిన కరోనాకు ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. అమెరికా, బ్రిటన్‌, భారత్‌, చైనా, ఇటలీ సహా పలు దేశాల పరిశోధకులు మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నారు.

ఈ క్రమంలో​ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు పూర్తిగా సహకరించి.. సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సిన్‌ సరఫరాలను చేపడతామని బయోఫార్మా సంస్థ ఆస్ర్టాజెనెకా గురువారం శుభవార్తను చెప్పింది. కాగా యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కూడా కరోనా పేషెంట్ల చికిత్సలో సత్ఫలితాలనిస్తుందని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరించారు. (ఆ డ్రగ్‌ వాడుతున్నా.. అవన్నీ వట్టి మాటలే: ట్రంప్‌)

కోవిడ్‌ కట్టడికి డ్రగ్‌ అభివృద్ధి: చైనా శాస్త్రవేత్తలు

>
మరిన్ని వార్తలు