ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?

22 May, 2020 18:33 IST|Sakshi

గాయాలతో బయటపడ్డ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్

సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మసూద్‌

కరాచీ: తీవ్ర విషాదాన్ని నింపిన పాకిస్తాన్‌ విమాన ప్రమాదంలో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అనేది పాకిస్తాక్‌కు చెందిన బ్యాంక్. ఇది లాహోర్‌లో ఉంది.

అటు ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ ట్వీట్‌ చేశారు. (పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం)


పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు వెంటనే రంగంలోకి సహాయక చర్యల్ని చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.

కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన విమాన ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సిబ్బందితోపాటు 99 మంది ప్రయాణికులు మొత్తం 106 మంది బతికి వుండే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఈద్ కారణంగా ప్రత్యేక పీఏఐ ఎయిర్‌బస్ ఎ 320 విమానం లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరింది. ల్యాండిగ్‌కు ఒక నిమిషం ముందు  సాంకేతిక  సమస్య తలెత్తడంతో  శుక్రవారం  మధ్యాహ్నం కరాచీ విమానాశ్రయానికి  అర కిలోమీటర్ దూరంలో జనసాంద్రత గల జిన్నా గార్డెన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది.  కాగా,  2016  డిసెంబరు 7 తరవాత పాకిస్తాన్‌లో చోటు చేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. 


బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ (ఫైల్‌ ఫోటో)

మరిన్ని వార్తలు