ఉపవాసం లేకుంటే జైలుకి పంపుతారా?

13 May, 2017 11:23 IST|Sakshi
ఉపవాసం లేకుంటే జైలుకి పంపుతారా?
న్యూఢిల్లీ : ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. అయితే ఈ మాసంలో ఉపవాస దీక్షలు పాటించకుండా ఆహారం స్వీకరిస్తే జైలుకి పంపే చట్టాన్ని పాకిస్తాన్ తీసుకొచ్చింది. ఈ చట్టంపై మాజీ పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో కూతురు మండిపడ్డారు. ప్రజలను పొట్టను పెట్టుకుంటున్న ఉగ్రవాదులను మాత్రం తమ దేశం రోడ్లపై స్వేచ్ఛగా తిరగనిస్తుంది, కానీ రంజాన్ మాసంలో ఆహారం తీసుకుంటే జైలుకి పంపుతుందా? విమర్శించారు. ఇది ఇస్లామే కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ బెనజీర్ కూతురు బఖ్తవార్ భుట్టో-జర్దారీ ఓ ట్వీట్ చేశారు. 
 
రంజాన్ మాసంలో బహిరంగంగా ఆహారం తీసుకునే వారిపై మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీసుకొచ్చిన ఎహ్రామ్-ఈ-రమదాన్ ఆర్డినెన్స్ హాస్యాస్పదమైనదని ఆమె వర్ణించారు. ఈ హ్యాస్పాదమైన చట్టంతో ప్రజలు హీట్ స్ట్రోక్, డీహైడ్రేజషన్ తో చనిపోతారని  ఆమె చెప్పారు. ప్రతిఒక్కరూ ఇది చేయలేరన్నారు. ఇది అసలు ఇస్లామే కాదని మండిపడ్డారు. మలాలా లాంటి స్కూల్ పిల్లలపై దాడులు జరిపిన ఉగ్రవాదులెవరూ జైలు శిక్ష అనుభవించడం లేదు, అలాంటిది రంజాన్ మాసంలో మంచినీళ్లు తాగితే జైలుకి పంపిస్తారా? అని ప్రశ్నించారు.
 
ఈ వారంలో మొదట్లోనే 1980 ఆర్డినెన్స్ కు పాకిస్తాన్ సెనేట్ సవరణ చేసింది. ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసంలో స్మోకింగ్ చేసినా లేదా బహిరంగంగా తిన్నా 500 రూపాయల జరిమానాతో జైలు శిక్ష విధించనున్నారు. హోటల్స్, రెస్టారెంట్లపై కూడా ఈ జరిమానా ఉండనుంది. టీవీ ఛానల్స్ లేదా థియేటర్ హౌజ్ ఈ చట్టాన్ని అతిక్రమిస్తే 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగానే జరిమానా వేయనున్నారు. భుట్టోకున్న ముగ్గురు సంతానంలో ఈమె ఒకరు. బఖ్తవార్ సోదరుడు బిలావల్ ప్రస్తుతం ప్రతిపాక్ష పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ గా ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు