ట్రంప్‌..నాయకత్వంలో పూర్తిగా విఫలమయ్యారు

27 Feb, 2020 10:36 IST|Sakshi

వాషింగ్టన్‌ : భారత రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనబడిందని ఆ దేశ డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్‌ పేర్కొన్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా భారత్‌లో  డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన హింసాకాండపై ట్రంప్‌ స్పందిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అల్లర్లు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ ఇది ఇండియా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలపై బెర్నీ సాండర్స్ బుధవారం ట్విటర్‌ ద్వారా స్పందించారు.' భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మత ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. అయితే ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమని ట్రంప్ స్పందించారు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిగా నాయకత్వం లోపించింది. అంతేగాక ఒక వ్యక్తిగానూ మానవ హక్కుల విషయంలోనే పూర్తిగా విఫలమయ్యారు' అంటూ పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై బెర్నీసాండర్స్‌ మాత్రమే గాక ఇతర డెమొక్రాటిక్‌ సెనేటర్లు కూడా తప్పుబట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ తమ పౌరుల భద్రత కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముస్లింలపై దాడి నివేదికల మధ్య భారత ప్రభుత్వం ప్రజలకు విశ్వాసంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించాలని అమెరికా సంస్థ తెలిపింది.
(కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!)

(భారత్‌ గొప్ప దేశం: ట్రంప్‌)

మరిన్ని వార్తలు