గుట్టలుగా చిన్నారుల కంకాళాలు

9 Jun, 2018 14:11 IST|Sakshi
పంపా లా క్రూజ్‌ ప్రాంతంలో తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలు

లిమా: చరిత్రలోనే అతిపెద్ద నరబలిని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పెరూకు ఉత్తర ప్రాంతంలో వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొలంబియన్‌ పూర్వపు చిమూ నాగరికతకు చెందిన చిన్నారులను పెద్ద మొత్తంలో బలి ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తాజాగా 140 మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డ హువాన్చాకో సమీపంలోని పంపా లా క్రూజ్‌ ప్రాంతంలో ఈ శవాల దిబ్బ బయటపడటం విశేషం. (అతిపెద్ద బాలల నరబలి)

అయితే ప్రస్తుతానికి 56 అస్థిపంజరాలను వెలికీ తీసినప్పటికీ.. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపేకొద్దీ వందల కొద్దీ అవశేషాలు బయటపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాటిన్ అమెరికన్ దేశమైన పెరూలో వందల ఏళ్ల క్రితం చిన్నారులను బలి ఇచ్చే సంప్రాదాయం ఉండేది. ప్రస్తుతం లభ్యమైన కంకాళాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీరందరినీ దాదాపు ఒకేసారి బలి ఇచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కార్బన్‌ డేటింగ్‌ పద్దతిలో ఇవి సుమారు 600 ఏళ్ల క్రితం చెందినవిగా నిర్ధారించారు. నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఈ పరిశోధనకు నిధులు సమకూరుస్తుండటం విశేషం.

‘ఈ పిల్లలందరూ 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు వారే. పిల్లల ఛాతి మధ్య ఎముక సహా ఇతర ఎముకలపై గాట్లు ఉన్నాయి. చాలా పక్కటెముకలు ధ్వంసమై ఉన్నాయి. శరీరం నుంచి గుండెను వేరే చేశారు శిలా స్ఫటికంతో తయారు చేసిన ఎర్రని రంగును చిన్నారులకు పూశారు. బలి ఇచ్చే ఆచార సంప్రదాయాల్లో ఇది ఒక భాగమై ఉండొచ్చు’ అని ఓ శాస్త్రవేత్త తెలిపారు. 2011లో ఉత్తర తీరంలో తొలుత అస్థిపంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. గత ఐదేళ్లుగా పరిశోధనలను ముమ్మరం చేశారు. వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాలతోపాటు దక్షిణ అమెరికాలో కనిపించే లామాస్‌(ఒంటె తరహా జీవి) అవశేషాలను వందల సంఖ్యలో ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు.

కాగా, చిమూ నాగరికతకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్కా నాగరికత రంగ ప్రవేశంతో చిమూ నాగరికత అంతమైపోయింది. అయితే ఆ తర్వాత 50 ఏళ్లకు స్పెయిన్ వలసవాదులు దక్షిణ అమెరికాలో అడుగుట్టి ఇన్కా నాగరికతను మట్టికరిపించారు.

మరిన్ని వార్తలు