భారత ఫార్మా రంగంపై బిల్‌గేట్స్‌ ప్రశంసలు

16 Jul, 2020 14:53 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. భారత్‌తో సహా పలు దేశాల్లో ఇప్పటికే మనుషుల మీద ప్రయోగాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఫార్మా రంగాన్ని ఆకాశానికెత్తారు. తమ దేశానికే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేయగల సత్తా భారత్‌కు ఉందని తెలిపారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం భారత్‌లో ఇప్పటికే చాలా ముఖ్యమైన పరిశోధనలు జరిగాయని.. ఇతర వ్యాధుల కోసం ఉపయోగించిన పలు కాంబినేషన్‌లతో కరోనాకు వ్యాక్సిన్‌ రూపొందించడానికి భారత్‌ ఫార్మా కంపెనీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ‘ఇండియాస్‌ వార్‌ ఎగెనెస్ట్‌ ది వైరస్’‌ అనే డాక్యుమెంటరీలో మాట్లాడుతూ బిల్‌ గేట్స్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం డిస్కవరీ చానెల్‌లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం అవుతుంది. (వ్యాక్సిన్​ అందరికీ పంచాలి: ట్రూడో)

బిల్‌ గేట్స్‌ మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావం భారతదేశం మీద కూడా భారీగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ. అలానే పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగానే ఉంటుంది. భారతదేశంలో డ్రగ్‌, వ్యాక్సిన్‌ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లోని ఫార్మా కంపెనీలు ప్రపంచానికి అవసరమయిన వ్యాక్సిన్‌లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఉత్పత్తి అయినంత భారీగా వ్యాక్సిన్‌లు ప్రపంచంలో మరెక్కడా తయారు కాలేదు. ఇదే కాక బయో ఈ, భారత్‌(బయోటెక్‌) వంటి ఎన్నో ప్రసిద్ధ ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. తన ప్రజలకే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్‌ సొంతం’ అన్నారు బిల్‌ గేట్స్‌. అంతేకాక భారత్‌ ‘కొయిలేషన్‌ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్’(సీఈపీఐ)లో చేరడం పట్ల గేట్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లు తయారు చేసే కంపెనీల కూటమి. (ఈ మందులు నిల్వ ఉంచండి)

మరిన్ని వార్తలు