లండన్ : కరోనా మహమ్మారి నియంత్రణకు పెద్దసంఖ్యలో వాక్సిన్ తయారీకి ఏడాదికి పైగా సమయం పడుతుందని, పరిస్థితులు అనుకూలించని పక్షంలో అసలు వ్యాక్సిన్ రాబోదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. ప్రాణాంతక వైరస్ నిరోధానికి ప్రకటించిన లాక్డౌన్ను దశలవారీగా సడలించే క్రమంలో 50 పేజీల ప్రభుత్వ మార్గదర్శకాలకు జాన్సన్ రాసిన ముందు మాటలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచే నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం సహా మార్గదర్శకాలను విధిగా పాటించాలని సూచించారు.
బహుళ ప్రజానీకానికి వ్యాక్సిన్ లేదా చికిత్స అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదికి పైగా సమయం పడుతుందని జాన్సన్ చెబుతూ దీనికోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్, లండన్కు చెందిన శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ రాకపోయిన ప్రస్తుత పరిస్థితిని అధిగమించేలా మన ప్రణాళికలు ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ లేదా ఔషధ చికిత్సలు దీర్ఘకాలిక పరిష్కారాలుగానే సాధ్యమవుతాయని, వ్యాక్సిన్ అభివృద్ధితో బ్రిటన్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తోందని చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా దిగ్గజం ఆస్ర్టాజెనెకా చేతులు కలపడం సానుకూల పరిణామమని అన్నారు.