అమెజాన్‌ కార్చిచ్చు: దానికి మేమే కారణం!

1 Sep, 2019 09:37 IST|Sakshi

మా దేశంలో వ్యవసాయ భూమి కొరత ఉంది

పర్యావరణాన్ని రక్షిస్తే మాకేంటి లాభం?

బ్రెజిల్‌ అధ్యక్షుడు సిన్స్ బొల్సోనారో వ్యాఖ్యలు

బ్రెసిలియా: అమెజాన్ మహారణ్యంలో భారీ ఎత్తున కార్చిచ్చు చెలరేగింది. వేలాది ఎకరాల్లో అడవి ధ్వంసమవుతున్నది. ఏ దేశంలో అయినా అడవుల్లో మంటలు చెలరేగడం సర్వసాధారణం. కానీ.. అమెజాన్ అడవిలో  చెలరేగిన కార్చిచ్చుతో ప్రపంచం ఉలిక్కి పడుతున్నది. దాదాపు అన్ని దేశాల్లో అమెజాన్‌కు సంఘీభావంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఏకంగా జీ-7 కూటమిలో ఈ కార్చిచ్చుపై చర్చించారు. సహాయ నిధి కింద రూ.వందల కోట్ల మేర డబ్బు పోగయ్యింది. మంటలను అదుపుచేయాలంటూ అంతర్జాతీయ సమాజం బ్రెజిల్ అధ్యక్షుడిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది.

అమెజాన్‌ అడవులను ఖాళీ చేస్తాం..
ఈ నేపథ్యంలో ఆదివారం బ్రెజిల్‌ అధ్యక్షుడు సిన్స్ బొల్సోనారో దీనిపై స్పందించారు. మీడియా సమావేశంలో అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘బ్రెజిల్‌లో వ్యవసాయ భూమి కొరత ఉంది. అమెజాన్‌ అడవులను ఖాళీ చేయడం మాకు అత్యవసరం. మా దేశంలో అడవులు 66శాతానికి పైగా ఉన్నాయి. ఏ దేశంలోనైనా 33 శాతం ఉంటే సరిపోతుంది. పర్యవరణాన్ని కాపాడటం మూలంగా మాకు వచ్చే లాభం ఏమీలేదు. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాల నుంచి తమకొచ్చే ప్రతిఫలం శూన్యం’ అంటూ ఆశ్చర్యకరరీతిలో సమాధానమిచ్చారు. అధ్యక్షుడి వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తవుతున్నాయి. అమెరికా, యూరప్‌ దేశాలతో ఉన్న మొండి వైఖరి కారణంగానే బోల్సోనారో ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడితున్నాయి. మరోవైపు అమెజాన్‌ అడవులను రక్షించే బాధ్యత బ్రెజిల్‌ ప్రభుత్వంపై ఉందని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.  

అమెజాన్ అడవులు దాదాపు తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 60 శాతం బ్రెజిల్‌లోనే ఉన్నది. ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిన్స్ బొల్సోనారో విధానాల వల్ల అడవి వేగంగా ధ్వంసమవుతున్నదని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా గనుల తవ్వకానికి, అడవులను వ్యవసాయ భూములుగా మార్చడానికి ఆయన అనుమతులు ఇచ్చారని, అడవిని కాపాడేందుకు అంతర్జాతీయంగా వస్తున్న విన్నపాలను పట్టించుకోవడంలేదని చెప్తున్నారు. ఫలితంగా 2013తో పోల్చితే ఈ ఏడాది రెట్టింపునకు పైగా కార్చిచ్చులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు