కలను నిజం అనుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని..

16 Sep, 2019 18:17 IST|Sakshi

కాలిఫోర్నియా : నిద్రలో వచ్చే కలలు ఉదయం లేచేసరికి గుర్తుండం చాలా అరుదు. అయితే అలా వచ్చిన కలలు వాస్తవంలో జరుగుతాయా లేదా అంటే చెప్పడం కష్టం. కానీ ఓ మహిళ మాత్రం తనకు నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని నిద్రలోనే తన నిశ్చితార్థపు ఉంగరాన్ని మింగేసింది. ఈ విచిత్ర ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాలు.. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోకు చెందిన జెన్నా ఎవాన్స్‌ అనే మహిళకు ఇటీవలే బాబీ హోవెల్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఓ రాత్రి జెన్నా నిద్రలో ఉండగా.. ఆమెకు ఓ విచిత్రమైన కల వచ్చింది.

జెన్నా, బాబీతో కలిసి ఓ రైలులో ప్రయానిస్తుండగా వారిని దొంగలు వెంబడించినట్లు కల వచ్చింది. ఈ క్రమంలో వారి నుంచి రక్షించుకోవడానికి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి నోటిలో వేసుకొని మింగేయమని బాబీ సలహా ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు జరిగింది కలే కాబట్టి బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు విషయం దాగుంది. నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని జెన్నా తన చేతికి ఉన్న ఉంగరాన్నినిజంగానే మింగేసింది. అనంతరం ఉదయం లేచిన ఆ మహిళ తన చేతిని చూసుకోగా ఉంగరం కనిపించలేదు. ఆ విషయాన్ని వెంటనే జెన్నా తనకు కాబోయే భర్తకు చెప్పింది.


దీంతో డాక్టర్‌ వద్దకు వెళ్లి ఎక్స్‌రే తీయించుకున్నారు. ఎక్స్‌రే అనంతరం వైద్యుడు ఆ ఉంగరం కడుపులోనే ఉందని నిర్ధారించి చెప్పాడు. అప్పడు అసలు విషయం బయట పడింది. నిద్రలో వచ్చిన కలను నిజం అనుకొని ఉంగరాన్ని మింగేసినట్లు గుర్తించిన ఆ జంట చివరికి వైద్యుడి సహాయంతో ఎండోస్కోపి ద్వారా ఆ ఉంగరాన్ని బయటకు తీయించారు. ఉంగరం తిరిగి తన వద్దకు చేరుకున్నందుకు ఆనందంగా ఉందని, ఇదోక హాస్యాస్పదమైన కథ అంటూ ఈ విషయాన్నంతా జెన్ని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. కాగా వీరిద్దరు వచ్చే నెలలో టెక్సాస్‌లో వివాహం చేసుకోనున్నారు.

మరిన్ని వార్తలు