ఒట్టావా: చైనాకు చెందిన రెండు పెద్ద పాండాలను ఆ దేశానికే తిరిగి పంపించేయనున్నట్లు కెనడా కల్గరి జంతు ప్రదర్శనశాల ప్రకటించింది. వాటికి ఆహారం సేకరించడం కష్టతరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా కాల్గరీ జూ మార్చి 16న తాత్కాలికంగా మూసివేశారు. అందులో ఇతర జంతువులతోపాటు ఎర్ షన్, డామావో అనే రెండు పాండాలున్నాయి. ఇవి వెదురు చెట్లను ఆహారంగా తీసుకుంటాయి. సాధారణంగా చైనా నుంచి వెదురును తెప్పించి వాటికి ఆహారాన్ని అందించేవారు. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారయ్యాయి. (అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం)
విమానాల రద్దుతో వెదురు రవాణా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో జూ అధికారులు వెదురు కోసం ఇతర మార్గాలను అన్వేషించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అవి ఆకలితో అలమటిస్తూ చనిపోవడం ఇష్టం లేక వాటిని చైనాకు తరలించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ రెండు పాండాలు పది సంవత్సరాల షరతు మీద 2013లో చైనా నుంచి కెనడాకు తెప్పించారు. ముందుగా టొరంటో జంతు ప్రదర్శనశాలకు తరలించారు. అక్కడ ఐదు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత 2018లో వాటిని కాల్గరీ జూకు తరలించారు. అప్పుడు వాటికి పన్పన్, జియా యోయు అనే రెండు పిల్ల పాండాలు జన్మించాయి. వీటిని జనవరిలోనే చైనాకు తరలించారు. (మే 16 నుంచి 22 వరకు)