దొంగలకే చుక్కలు చూపించిదెవరంటే...

29 Jul, 2017 15:13 IST|Sakshi



పక్కా ప్లాన్‌తో వచ్చిన  దొంగలకు అక్కడున్న గ్లాస్‌  కౌంటర్‌  చుక్కలు  చూపించిన వైనం కెమెరాకు చిక్కింది.  చోరాగ్రేసరుల  రకరకాల చోళకళ గురించి మనం చాలానే విన్నాం. అయినా ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్లూతో దొరికిపోవడం మామూలే. ముఖ్యంగా సీసీ టీవీలు వచ్చిన తరువాత   పోలీసులకు ఈ పని  మరింత సులువైంది. అయితే మలేసియాలోని ఓ  జ్యుయలరీ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగలకు  అనుకోని చుక్కెదురైంది. ఎంత చోమటోడ్చినా ఫలితం దక్కకపోవడంతో తోకముడవక తప్పలేదు. ఈ దోపిడీ ప్రయత్నంచేసిన దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నలుగురు దొంగల ముఠా సెక్యూరిటీని గన్‌తో  బెదిరించి మరీ  మలేషియాలోని ఒక ఆభరణాల దుకాణంలోకి ఎంటర్‌ అయింది. ముఖాలకు హెల్మెట్లు, సుత్తులు లాంటి సరుకు సరంజామాతో పనిలోకి దిగారు.   త‌మ వెంట తెచ్చుకున్న సుత్తెల‌తో జ్యూయెల‌రీ షోరూమ్‌లోవున్న డిస్ ప్లే కౌంట‌ర్ గ్లాసులను పగల కొట్టడానికి  ట్రై చేశారు. ఒకరి తరువాత ఒకరు ఇద్దరు దొంగలు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.  అది చాలా మందంగా వుండడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసినవికావడంతో  ఆ గ్లాస్ ప‌గ‌ల్లేదు. ఇక‌ చేసేదేమీలేక  అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఈ త‌తంగ‌మంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.  ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ  చక్కర్లు కొడుతోంది.  కెడై ఇమాస్ శ్రీ ఆలం  జ్యుయల్లరీ  షోరూం లో సోమవారం  సాయంత్రం ఈ ఘటన చోటు  చేసుకుంది.  ఫేస్‌బుక్‌ లో దాదాపు 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, వేలాది షేర్లను సొంతం చేసుకుంది.