నిర్బంధ కేంద్రాల్లో భారతీయులు

23 Jun, 2018 01:52 IST|Sakshi
నిర్బంధ కేంద్రంలో మాట్లాడుతున్న మెలానియా

వంద మంది ఉన్నారు: అమెరికాలోని భారత రాయబారి

వారిలో అత్యధికులు సిక్కులే

వాషింగ్టన్‌/హూస్టన్‌: ఇటీవల అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధానికి గురైన వారిలో వంద మంది వరకు భారతీయులు కూడా ఉన్నారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని నిర్బంధ కేంద్రంలో 40 నుంచి 45 మంది, ఓరెగాన్‌ రాష్ట్రంలోని కేంద్రంలో మరో 52 మంది భారతీయులు ఉన్నారనీ, ఆ రెండు నిర్బంధ కేంద్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 52 మందిలో అత్యధికులు సిక్కులు, క్రైస్తవులేనని అధికారులు చెప్పారు.

‘ఓరెగాన్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఇప్పటికే మా అధికారి సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూ మెక్సికోలోని కేంద్రానికి కూడా మరో అధికారి వెళ్తారు’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్లో అత్యధికులు సిక్కులే ఉంటున్నారు. 2013–17 మధ్యలో దాదాపు 27 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ నిర్బంధానికి గురవ్వగా, చాలామంది ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు.

నిర్బంధ కేంద్రం సందర్శించిన మెలానియా
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ శుక్రవారం టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రంలో హొండురాస్, గ్వాటెమాలా, ఎల్‌సాల్వడార్‌ దేశాలకు చెందిన 55 మంది చిన్నారులు ఉండగా వారితో మెలానియా నేరుగా మాట్లాడారు. అక్కడి సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ.. పిల్లలను తమ తల్లిదండ్రుల వద్దకు వీలైనంత తొందరగా చేర్చడానికి తన నుంచి ఎలాంటి సాయం కావాలో చెబితే చేస్తానని ఆమె హామీనిచ్చారు. అయితే నిర్బంధ కేంద్రానికి బయల్దేరే ముందు మెలానియా ధరించిన వస్త్రాలపై ‘ఐ రియల్లీ డోంట్‌ కేర్‌. డూ యూ?’ (నేను ఏ మాత్రం లెక్కచేయను. మీరు చేస్తారా?) అని రాసి ఉండటం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భార్య ధరించిన వస్త్రాలపై స్పందిస్తూ ‘ఆమె వస్త్రాలపై రాసిన వ్యాఖ్యలు నకిలీ వార్తల మీడియాను ఉద్దేశించినవి’ అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు