క్వారీలో అబ్బురపరిచే అద్దాల భవనం!

15 Nov, 2018 17:29 IST|Sakshi

భూగర్భంలో 17 అంతస్థుల భవనాన్ని నిర్మించిన చైనా

షాంఘై‌: మనసుంటే మార్గముంటుందనే దానికి నిదర్శనమిది. ఏదో కొత్తగా చేయాలనే తపన, గట్టి సంకల్పం ముందు అన్ని ఆటంకాలు బలాదూర్‌ అయ్యాయి. సాదారణంగా మనం ఏదైనా మూలనపడ్డ క్వారీని చూసి, దీనిని ఏం చేయలేం ఇక దీని పని అంతే అని చూసి వెళతాం. ఆ క్వారీని నిరుపయోగం వదిలేస్తాం. కానీ మనం క్వారీనే వదిలేయటం లేదు. ఎంతో విలువైన స్థలాన్ని వృదాగా వదిలేస్తున్నాం. అది కొంత మంది ఇంజనీర్లకు నచ్చలేదు. అందుకే కళ్లు చెదిరే రీతిలో భవంతిని నిర్మించించి లోకానికి చూపించారు. మార్గ నిర్దేశం చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి తొలి కట్టడంగా పేరు గడించేలా చేశారు.

అద్భుత కట్టడాలకు నిలయమైన చైనా మరో నమ్మశక్యం కాని భవంతిని నిర్మించి ఔరా అనిపించింది. సెంట్రల్‌ షాంఘైకు అతి దగ్గరలో మూలనపడ్డ క్వారీలో హోటల్‌ను నిర్మించి అందరి చూపు అటువైపు తిప్పేలా చేశారు చైనా ఇంజనీర్లు. మూలనపడ్డ పెద్ద క్వారీలో ఏకంగా 17 అంతస్థుల హోటల్‌ను నిర్మించింది. 290 అడుగుల లోతు గల క్వారీలో నీరు చేరకుండా చీఫ్‌ ఇంజనీర్లు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 336 గదులతో భవనాన్ని నిర్మించారు. అందులోనూ ఈ హోటల్‌ను సాదాసీదాగా నిర్మించలేదు. రిలాక్స్‌ కావడానికి  పార్క్‌, స్విమ్మింగ్‌ పూల్‌, వాటర్‌ ఫాల్‌ వంటి అన్ని వసతులను కల్పించారు. దీంతో ఇలాంటి ప్రాజెక్ట్‌కు సరితూగే నిర్మాణమే ప్రపంచంలో లేదని చైనా తేల్చిచెప్పేసింది.

ఇక దీని కోసం చైనా ప్రభుత్వం 288 మిలియన్‌ డాలర్లను ఖర్చుచేసింది. 2013లో దీని నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ ఏడాదే భారీ వర్షాల కారణంగా సమీపంలోని నది ఉప్పొంగి ఈ క్వారీలోకి నీళ్లు చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. నీటి మట్టం తగ్గిన తర్వాత మరలా నిర్మాణానికి పూనుకున్నారు.  ఇక భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ఇంజనీర్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక క్వారీలో నీటి మట్టం ఎప్పుడూ ఒకేలా ఉంచేందుకు ప్రత్యేకంగా పంప్‌ హౌజ్‌ను ఏర్పాటుచేశారు. సెంట్రల్‌ షాంఘై నుంచి గంట ప్రయాణం చేస్తు ఈ హోటల్‌కు చేరుకోవచ్చు. ఇక ఇన్ని జాగ్రత్తలతో, అన్ని హంగులతో నిర్మితమైన ఈ హోటల్‌లో ఓ గది బుక్‌ చేసుకోవాలంటే రోజుకు 490 డాలర్ల ఖర్చవుతుంది.

మరిన్ని వార్తలు