శవ ‘సంస్కారం’ లేని చైనా!

15 Jul, 2020 08:56 IST|Sakshi

గల్వాన్‌ ఘటనలో ప్రాణాలర్పించిన సైనికుల అంతిమ సంస్కారాలకు అంగీకరించని వైనం

వాషింగ్టన్‌: దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల మృతదేహాలకు గౌరవ ప్రదమైన అంతిమ కర్మలు చేసే సంస్కారమూ లేకపోయింది పొరుగుదేశం చైనాకు! గత నెల 15వ తేదీన తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని గల్వాన్‌ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో కొంతమంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. భారత్‌ 20 మంది సైనికులను కోల్పోగా తమ సైనికులు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న చైనా.. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని వారి అంతిమ సంస్కారానికి కూడా అంగీకరించడం లేదని, కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారత్‌ మాత్రం తన వీరపుత్రులకు తగిన గౌరవ మర్యాదలిచ్చి వారి బలిదానాన్ని గుర్తించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.  చైనా మాత్రం ఇప్పటివరకూ ఆ ఘటనలో ఎంత మంది చనిపోయారో కూడా బహిర్గతం చేయలేదు. పైగా శోకసంద్రంలో ఉన్న సైనికుల కుటుంబాలను ప్రభుత్వం అవమానాల పాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలంటున్నాయి. సంప్రదాయాల ప్రకారం నిర్వహించే అంతిమ సంస్కారాలను సైనికుల కుటుంబాలు మరచిపోవాలంటూ...కరోనాను సాకుగా చూపినట్లు తెలుస్తోంది.  అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.

మరిన్ని వార్తలు