న్యూఢిల్లీ : ఇప్పటివరకూ అణుబాంబులు.. హైడ్రోజన్ బాంబులు.. తాజాగా హైపర్సానిక్ మిస్సైల్స్.. యుద్ధగతిని మార్చే ఆయుధాలివే. సాధారణ క్షిపణులకన్నా.. 5రెట్లు వేగంగా.. ఖచ్చితత్వంలో దూసుకెళ్లే వీటి కోసం అమెరికా, రష్యా, చైనాలు పోటీ పడుతున్నాయి. వీటి రూపొందించడం పూర్తయితే యుద్ధరంగ స్వరూపస్వభావాలే పూర్తిగా మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆధునిక ఆయుధాలు అగ్రదేశాల చేతిలో ఉన్నంత వరకూ ప్రపంచానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. అయితే పొరపాటున ఉగ్రవాద దేశాల చేతిలో పడితే మాత్రం ప్రపంచం సర్వనాశనం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైపర్సానిక్ క్షిపణులు రడార్ల వ్యవస్థకు అందవు.. అందువల్ల వ్యూహాత్మక యుద్ధం చేసేందుకు ఆయా దేశాలకు అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ ఆయా దేశాలకు మంచిదేకానీ.. పొరపాటు జరిగితే మాత్రం ఫలితం ఊహలకు అందదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం హైపర్సానిక్ మిస్సైల్స్ రూపకల్పనలో అమెరికా, రష్యా, చైనాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చైనా ఈ దిశగా ముందడుగు వేస్తే భారత్ లాంటి దేశాలకు ప్రమాదమేనని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.