మొబైల్‌ సర్వీస్‌ పొందాలంటే ఫేస్‌ స్కాన్‌ చేయాల్సిందే !

1 Dec, 2019 16:51 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలో ఇక నుంచి కొత్త మొబైల్‌ ఫోన్‌ సర్వీస్‌ పొందాలంటే తమ ముఖాన్ని స్కాన్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోవాల్సింది ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చైనా ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే నిబంధనలను ప్రకటించింది. తాజాగా ఆదివారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

'కొత్త నిబంధనల ప్రకారం కొత్త మొబైల్‌ కొన్నప్పుడు గానీ, లేదా మొబైల్‌ డేటా కాంట్రాక్టులను తీసుకున్నప్పుడు జాతీయంగా గుర్తింపు ఉన్న కార్డు చూపిస్తే సరిపోయేది. కానీ ఇక నుంచి గుర్తింపు కార్డుతో వారి ముఖాన్ని కూడా స్కాన్‌ చేయడం జరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు ఇచ్చిన ఐడీ సరైందో కాదో గుర్తించే అవకాశం ఉందని' చైనా ప్రభుత్వం పేర్కొంది. చైనాలో చాలా రోజుల క్రితమే అక్కడి ప్రజలు ఇంటర్నెట్‌ వాడాలంటే వారి అసలు పేరుతోనే లాగిన్‌ అయ్యేలా ఏర్పాటు చేసింది.

2017 నుంచి ఎవరైనా ఆన్‌లైన్లో కొత్త విషయాన్ని పోస్టు చేయాలంటే అసలు ఐడీని ఎంటర్‌ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. తాజాగా టెలికామ్‌ సంస్థల కోసం అమల్లోకి తెచ్చిన ఫేస్‌ స్కానింగ్‌ వల్ల వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించే అవకాశం కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మొబైల్స్‌ వినియోగించి ఇంటర్నెట్‌ను అత్యధికంగా వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు