చిత్తుగా తాగి మత్తుగా పడుకున్నాడు, ఆ తరువాత

25 Jun, 2020 18:30 IST|Sakshi

బీజింగ్‌: మీరు అదే పనిగా ఎత్తిన బాటిల్‌ దించకుండా బీర్లు తాగుతున్నారా? ఒకటి, రెండు కాదు ఏకంగా 10, 12 తాగుతూ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానీ స్థితిలోకి వెళ్తున్నారా? ఏది మర్చిపోయినా సరే బీర్‌ కానీ లేదా ద్రవ పదార్థాలు ఏవైనా తీసుకున్నప్పుడు మూత్ర విసర్జన చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చైనాలో ఒక వ్యక్తి పది బీర్లకు పైగా తాగి మత్తులో మూత్ర విసర్జన చేయకుండా నిద్రపోయాడు. ఉదయం లేచే సరికి అతడి  మూత్రాశయం పగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. (అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!)

చైనాకు చెందిన హూ(40) ఒక రోజు రాత్రి బార్‌లో 10 బీర్లకు పైగా తాగేసి ఆ మత్తులో మూత్రం పోయకుండానే 18 గంటల పాటు నిద్రపోయాడు. నిద్రలేవగానే అతనికి తీవ్రమైన నొప్పి రావడంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు హూ మూత్రాశయం మూడు చోట్ల పగిలి ద్రవం అతని కడుపులోకి చేరి నొప్పి వచ్చిందని తెలిపారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో అతని ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు. ఈ విషయం పై డాక్టర్‌ మాట్లాడుతూ, మనం ఏం తాగినా అది మూత్రాశయంలోకి చేరుతుందని, అది నిండగానే మూత్రం పోయాలన్నా సం‍కేతాలు వస్తాయన్నారు.  మత్తులో ఉన్న కారణంగా మెదడు నుంచి సంకేతాలు రాకపోవడంతో హూ అలాగే నిద్రపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. ఎంత నీరు తాగితే దానికి తగ్గట్టుగా మూత్రవిసర్జన చేయాలని తెలిపారు. ('ఇది త‌యారు చేసినవాడిని చంపేస్తా’)
  


 
 

మరిన్ని వార్తలు