అందువల్లే కేసులు తగ్గాయి.. లేదంటే 7 లక్షలు!

1 Apr, 2020 14:55 IST|Sakshi
షట్‌డౌన్‌ సమయంలో వుహాన్‌ నగరం

వైరస్‌ నియంత్రణపై పరిశోధన వెల్లడి

లండన్‌/బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరుకు చైనా తొలి 50 రోజుల్లో చేపట్టిన చర్యలు ఎంతో మేలు చేశాయని లండన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్‌-19 కట్టడికి చైనా కఠిన నిర్ణయాలు ఏమాత్రం ఆలస్యమైనా వుహాన్‌ బయట వైరస్‌ విపరీతంగా వ్యాపించి ఆ దేశంలో బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరేదని అన్నారు. చైనాలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలపై లండన్‌, చైనాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వైరస్‌ తొలి దశల్లో ఉన్న ప్రపంచ దేశాలకు తమ పరిశోధనా వివరాలు ఉపయుక్తం అవుతాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ క్రిస్టోఫర్‌ డై చెప్పారు.

‘చైనాలో వైరస్‌ బయటపడిన తొలి యాభై రోజుల (ఫిబ్రవరి 19) వరకు బాధితులు 30 వేలు. మా విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే.. వుహాన్‌ నగరంలో ట్రావెల్‌ బ్యాన్‌, నేషనల్‌ ఎమర్జెన్సీ విధించకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. వుహాన్‌ బయట.. అంటే చైనా వ్యాప్తంగా మొత్తం కేసులు 7 లక్షలకు చేరేవి. కట్టుదిట్టమైన చర్యలు, కఠిన నిర్ణయాలతో చైనా వైరస్‌ సంక్రమణను అడ్డుకోగలిగింది. బాధితులు, అనుమానితులతో సాధారణ ప్రజలను అస్సలు కలుసుకోనివ్వలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు వుహాన్‌ ప్రజలు నిర్బంధాన్ని పక్కాగా పాటించారు’అని పేర్కొన్నారు.
(చదవండి: విదేశాల్లోనూ టీకాను పరీక్షిస్తాం: చైనా)

‘జనవరి 23న వుహాన్‌లో విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ను అందరూ పాటించారు. వుహాన్‌ నగరం షట్‌డౌన్‌తో ఇతర పట్టణాలకు కోవిడ్‌-19 వ్యాప్తి ఆలస్యమైంది. దాంతో దాదాపు చైనాలోని మిగతా అన్ని ప్రాంతాలు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగాయి’అని పరిశోధకుల్లో ఒకరైన బీజింగ్‌ నార్మల్‌ యూనివర్సిటీ ఎపిడమాలజీ ప్రొఫెసర్‌ హువాయి టియాన్‌ తెలిపారు. ‘వుహాన్‌ దిగ్బంధం మూలంగానే.. వైరస్‌ విజృంభణ కొనసాగిన మిగతా దేశాల పట్టణాలతో పోల్చినప్పుడు... చైనాలో దాదాపు 33 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా సంక్షోభం నుంచి చైనా అప్పుడే బయటపడిందని చెప్పలేం’ అని పరిశోధకులు పేర్కొన్నారు.
(చదవండి: అగ్రరాజ్యం అతలాకుతలం)

మరిన్ని వార్తలు