అక్కడ పర్యటించకండి

6 Oct, 2017 09:02 IST|Sakshi

అండమాన్‌కు వెళ్లవద్దు

నికోబార్‌ దీవుల్లో పర్యటన ప్రమాదకరం​

మిలటరీ వ్యవహారాలను ఫొటోలు తీయవద్దు

తమ దేశ పర్యాటకులను హెచ్చరించిన చైనా

బీజింగ్‌ : భారత్‌తో సరిహద్దు వివాదానికి ఆజ్యం పోసేలా మళ్లీ డోక్లాంకు పది కిలోమీటర్ల దగ్గర్లో రహదారి నిర్మిస్తున్న చైనా.. తాజాగా భారత్‌లో పర్యటించే తమ దేశస్తులకు ట్రావెల్‌ వార్నింగ్‌ జారీ చేసింది. ప్రతి ఏడాది భారత్‌లో గణనీయంగా చైనీయులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ డోక్లాం వద్ద రహదారి నిర్మిస్తున్న నేపథ్యంలోనూ, అంతర్జాతీయ మారుతున్న సమీకరణలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలకు వెళ్లవద్దంటూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లోని అండమాన్‌, నికోబార్‌దీవుల్లో చైనీయులు పర్యటించడం ప్రమాదరమంటూ.. చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

భారత్‌లో పర్యటిస్తున్న చైనీయులు తగిన అనుమతి పత్రాలతోనే పర్యటించాలని సూచించింది. అంతేకాక మిలటరీ వాహనాలు, సరిహద్దు బద్రతా బలగాలు, ఇతర రక్షణ, పోలీసుల వ్యవస్థలను ఫోటొలు, వీడియోలు తీయవద్దంటూ తెలిపింది. అంతేకాక భారత్‌-నేపాల్‌ పరిహద్దులోనూ పర్యటించడం మానుకోవాలని సూచనలు చేసింది.  జూలై 7న డోక్లామ్‌ వివాదం మొదలైన తరువాత చైనా తొలిసారి తమ పర్యాటకులకు హెచ్చరికలు చేసింది. తరువాత మళ్లీ తాజాగా చైనా ప్రభుత్వం హెచ్చరించింది.  

భారత్‌ను చూసేందుకు చైనా నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వారికి వీసా ఇబ్బందులు తలెత్తకుండా భారత ప్రభుత్వం.. ఈ-వీసా సదుపాయాన్ని గతంలో అందించించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు