వైరస్‌పై చైనా జాప్యం 

3 Jun, 2020 03:45 IST|Sakshi

జన్యుక్రమాన్ని అందించడంలో అనవసర ఆలస్యం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌కు సంబంధించిన వివరాలను అందించకుండా చైనా ఆలస్యం చేసిందనేందుకు పలు ఆధారాలు లభించాయి. వైరస్‌ జన్యుక్రమం రూపొందించిన తరువాత కొన్ని వారాల పాటు దాన్ని చైనా ఇతర దేశాలతో కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో కానీ పంచుకోలేదు. జన్యుక్రమం ఆధారంగానే నిర్ధారణ పరీక్షలను కానీ, టీకాను, ఔషధాలను రూపొందిం చడం సాధ్యమవుతుంది. కానీ డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం కరోనా విషయంలో చైనా వేగంగా స్పందించిందని, తక్షణమే జన్యుక్రమాన్ని అందించిందని జనవరి నెలంతా ప్రశంసిస్తూ వచ్చింది.

నిజానికి, చైనాలోని కొన్ని ప్రభుత్వ పరిశోధన శాలలు డిసెంబర్‌ చివర్లోనే వైరస్‌ జన్యుక్రమాన్ని పూర్తిగా రూపొందించాయి.  ఒక వైరాలజీ వెబ్‌సైట్‌లో జనవరి 11న దాన్ని ప్రచురించింది. ఆ తరువాతే అధికారులు దాన్ని బహిర్గతం చేశారు. ఆ తరువాత కూడా.. దాదాపు రెండు వారాల పాటు అవసరమైన వివరాలను డబ్ల్యూహెచ్‌ఓకు చైనా అందజేయలేదు. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ అంతర్గతంగా ఆందోళన చెందుతూనే ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ అంతర్గత సమావేశాల వివరాలను, విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని క్రోడీకరించి ‘అసోసియేట్‌ ప్రెస్‌’ ఈ వివరాలను వెల్లడించింది. 

మరిన్ని వార్తలు