పేట్రేగిన ఉన్మాది: కత్తితో చిన్నారులపై దాడి

29 Feb, 2016 23:00 IST|Sakshi
కత్తితో పిల్లల్ని తరుముతోన్న ఉన్మాది.

పౌరులకు తుపాకులిచ్చే విషయంలో ఆంక్షలు లేకపోయేదుంటే సామూహిక హత్యాకాండల్లో చైనా అమెరికాను ఎప్పుడో దాటిపోయేది. వ్యవస్థపై ఉన్న కోపంతో అమాయకులపై  దాడులకు పాల్పడుతోన్నవారి సంఖ్య కమ్యూనిస్ట్ దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. సోమవారం హైనన్ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన అందుకు మరో ఉదాహరణ..

మటన్ కొట్టే కత్తిని చేతబట్టుకున్న ఉన్మాది.. ఓ ప్రైమరీ స్కూల్ లోకి చొరబడి చేతికందిన పిల్లలను నరికేప్రయత్నం చేశాడు. లంచ్ టైమ్ కావడంతో విద్యార్థులంతా గ్రౌండ్ లోకి వచ్చారు. అదే అదనుగా వాళ్లపై విచక్షణా రహితంగా దాడిచేశాడా ఉన్మాది.  హైకూ నగరంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్మాది దాడితో స్కూల్ ఆవరణలో ఎటుచూసినా రక్తపు మరకలే అగుపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకునేలోపే ఉన్మాది పరారయ్యాడు. కాసేపటి తర్వాత స్కూల్ పక్క సందులో విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసులు కాల్చి చంపారా అన్నది తెలియాల్సిఉంది. గాయపడ్డ విద్యార్థుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఉన్మాదిని హాంకాగ్ జాతీయుడైన లీ గా గుర్తించామని, ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

చైనాలో సామాజిక ప్రతీకార(సోషల్ రివేంజ్) దాడులకు దిగుతోన్నవారు ప్రధానంగా చిన్నపిల్లల్నే టార్గెట్ చేసుకుంటుండటం గమనార్హం. గత ఏడాది మార్చిలో షాంఘైలో చోటుచేసుకున్న దాడిలో ఓ ఉన్మాది ఆరుగురు పిల్లలు సహా 11 మందిని కత్తితో పొడిచి చంపేశాడు. అంతకు ముందు ఏడాదిలో సోషల్ రివేంజ్ దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 17గా ఉంది. కత్తులతోనే తాక చిన్నతరహా పేలుళ్ల ద్వారాను అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నారు ఉన్మాదులు.

మరిన్ని వార్తలు