24 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ...

3 Apr, 2018 15:29 IST|Sakshi

బీజింగ్‌ : ఆ తల్లిదండ్రుల  24 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. మూడేళ్ల ప్రాయంలో తప్పిపోయిన తమ కూతురిని ఎట్టకేలకు కలుసుకున్నారు. సుఖాంతంగా ముగిసిన ఈ కథనం వివరాలు...చైనా సిచుయాన్‌ ప్రోవిన్స్‌లోని చెంగ్డుకు చెందిన మింగ్‌క్వింగ్‌ కుమార్తె 1994లో తప్పిపోయింది. నాటి నుంచి మింగ్‌క్వింగ్‌ తప్పిపోయిన తన కూతురి ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తమ కుమార్తె పోస్టర్లను ప్రచురించాడు. పిల్లల ఆశ్రమా‍లు, ఆస్పత్రుల్లో వెతికారు. ఆమె జాడ కనుక్కొడానికి ఏ ఒక్క ప్రయత్నాన్ని వదల్లేదు. అయినా ఫలితం లేకపోవడంతో 2015 నుంచి కొత్త దారిలో వెతకడం ప్రారంభించారు.

2015నుంచి మింగ్‌క్వింగ్‌ టాక్సీ నడపడం ప్రారంభించాడు. తన టాక్సీ ఎక్కడానికి వచ్చే ప్రయాణికులకు తప్పిపోయిన తన కూతురు గురించి చెప్పేవాడు. ఇలా దాదాపు 17వేల మందికి తన కూతురు గురించి చెప్పాడు. ఇంటర్‌నెట్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేయాల్సిందిగా వారందరిని కోరాడు. కుమార్తె ఫోటోతో కూడిన వివరాలను తన టాక్సీ మీద ప్రదర్శించాడు. ఎట్టకేలకు ఆ తండ్రి ప్రయత్నం ఫలించి తన కూతురు కాంగ్‌ యింగ్‌ను కనుక్కోగలిగాడు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు తమ కూతురు రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం కాంగ్‌ యింగ్‌ తల్లిదండ్రులను చేరుకోనుంది.

మరిన్ని వార్తలు