డ్రైవర్ల అవసరం లేని వాహనాల గురించి మనం వినే ఉంటాం. అయితే డ్రైవర్ లేని రైలు గురించి విన్నారా.. అవును డ్రైవర్ లేని రైలును ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం రియో టింటో ప్రయోగాత్మకంగా వాడుకలోకి తెచ్చింది. వారం కింద డ్రైవర్ లేని రైలుతో దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించినట్లు సంస్థ ప్రతినిధి క్రిస్ సాలిస్బరి తెలిపారు.
భవిష్యత్తులో ముడి ఉక్కు ఖనిజాన్ని రవాణా చేసేందుకు ఈ రైళ్లనే వాడతామని చెబుతున్నారు. నిజానికి డ్రైవర్ రహిత రైళ్లను రియో టింటో వాడటం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభం నుంచీ వాడుతున్నా వాటిల్లో ఒక డ్రైవర్ను సేఫ్టీ కోసం ఉంచేవారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ కూడా లేకుండా కొన్ని రైళ్లు దూసుకుపోతున్నాయి. వచ్చే ఏడాదికి తమ ఆధ్వర్యంలో నడిచే అన్ని రైళ్లను డ్రైవర్ రహితంగా మార్చేస్తామని ఆ కంపెనీ చెబుతోంది.