భారతీయ సీనియర్లు వేధించారు!

20 Mar, 2018 03:26 IST|Sakshi

లాస్‌ఏంజెలెస్‌: తమను బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, ఆ స్థానంలో తక్కువ అర్హతలున్న దక్షిణాసియా వాసుల్ని నియమించుకున్నారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌పై లాస్‌ ఏంజెలెస్‌లోని డిస్ట్రిక్ట్‌ కోర్టులో ముగ్గురు మాజీ ఉద్యోగులు కేసు దాఖలు చేశారు. భారత్‌కు చెందిన పై అధికారులు, సహ ఉద్యోగులు అవమానించారని, తక్కువ రేటింగ్‌ ఇవ్వడంతో పాటు ప్రమోషన్లు నిరాకరించారని తమ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.

అయితే తమపై దాఖలైన కేసు చట్టపరంగా చెల్లదని హెచ్‌–1బీ వీసాదారులు అత్యధికంగా పనిచేస్తున్న జాబితాలో రెండో స్థానంలో ఉన్న కాగ్నిజెంట్‌ కోర్టుకు తెలిపింది. ఆ ఆరోపణలు అమెరికా పౌర హక్కుల చట్టం కిందకు రావని ఆ కంపెనీ వాదిస్తోంది. ‘పౌర హక్కుల చట్టం 1964 ప్రకారం.. జాతి ఆధారంగా వివక్ష నిషేధం. అయితే దేశం ఆధారంగా వివక్ష చూపారని ఈ కేసులోని కక్షిదారులు ఆరోపించారు. అందువల్ల ఆరోపణలు చెల్లవు’ అని కోర్టుకు వెల్లడించింది. గురువారం కోర్టు తన నిర్ణయం వెలువరించనుంది.

మరిన్ని వార్తలు