వాళ్లిద్దరికీ దేవుడు రాసిపెట్టాడు..

15 Mar, 2018 14:07 IST|Sakshi
వారిద్దరిని కలిపిన ప్రదేశం చైనాలోని ఫోర్త్‌ స్క్వేర్‌.

దేవుడి మహిమలంటే అంతే మరి. మనల్ని పుట్టిస్తాడు. మన తోడును మనకోసం ఇంకెక్కడో పుట్టిస్తాడు. దేవుడు ఆడే ఈ ఆటలో... ఒక్కొసారి మనతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి మన పక్కనే ఉన్న తెలుసుకోలేకపోతాం. మళ్లీ ఎప్పటికో కలుస్తాం. అదే విధి. దేవుడు ఆడే చదరంగం. భూమి గుండ్రంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా...తిరిగి రావాల్సిన చోటుకే వస్తారు. ఇప్పుడీ వేదాంతం అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ కథేంటో ఓసారి చూద్దాం

చైనాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక యువకుడు (యే) చైనాలో క్వింగ్డావోలోకి ఒక కట్టడం ముందు ఫోటో దిగాడు. అక్కడే పక్కన ఒక అమ్మాయి (జియు) కూడా ఫోటో దిగింది. ఇది జరిగింది 2000 సంవత్సరంలో. సరిగ్గా 11 ఏళ్ల తర్వాత అంటే 2011లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. ఆ దంపతులిద్దరూ తమ జ్ఞాపకాలకు సంబంధించిన అప్పుడెప్పుడో దిగిన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు. జియు దిగిన ఫోటోలో తన భర్త కూడా ఉండటాన్ని ఆమె గమనించింది.  అనుకోకుండా జరిగిన ఈ సంఘటనపై ఆశ్చర్యపోవడం వారివంతు అయింది.

పదకొండు సంవత్సరాలక్రితమే విధి వారిని దగ్గర చేసింది. అయితే అప్పుడు వారికి తెలియదు. మళ్లీ పదకొండు సంవత్సరాల తరువాత ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకుంటారనీ. ఇప్పుడు వారిద్దరు తమ కవల పిల్లలతో మళ్లీ అదే ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నారట. ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా మళ్లీ అక్కడికి వెళ్లి ఫోటోలు దిగాలనుకుంటున్నామని తెలిపారు. ఇంతకీ ఆ ప్రదేశం ఏంటో చెప్పలేదు కదూ...చైనా దేశంలోని క్వింగ్డావోలోని ఫోర్త్‌ స్క్వేర్‌.

>
మరిన్ని వార్తలు