కరోనా: హృదయ విదారక చిత్రం..

6 Mar, 2020 19:03 IST|Sakshi

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ఈ పేరు వినగానే ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడ, ఏ మూల నుంచి తమ మీద దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పటి వరకు 85 దేశాలకు వ్యాప్తి చెందగా.. ఇటీవల భారత్‌లో కూడా ప్రవేశించిం‍ది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 97 వేలకు చేరగా.. 3,350 మంది మరణించారు. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 31కి చేరింది. అంతేగాక కరోనా దౌర్భాగ్యమా అని  ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కళ్ల ముందు దర్శనిమిస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్‌ బారిన పడిన ఓ వృద్ధుడు తన భార్యతో గ్లాస్‌ కిటికీ ద్వారా మాట్లాడుతున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (హృదయాలను కదిలిస్తున్న ఫొటో)

అమెరికాలోని వాషింగ్టన్‌లో 60 ఏళ్ల జీన్‌ కాంప్‌బెల్‌ అనే వృద్ధుడికు కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వృద్ధుడు తన భార్యతో మాట్లాడాలనుకున్నాడు. అయితే ఈ మహమ్మారి ఎక్కడ అతని నుంచి ఆమెకు ప్రబలుతుందనే భయంతో వైద్యులు అందుకు నిరాకరించారు. అయితే ముసలాయన బాధ చూసిన వైద్యులు ఓ ఆలోచన చేశారు. భార్యను ఆసుపత్రి బయటకు తీసుకొచ్చి గ్లాస్‌ కిటికీ ద్వారా భర్తతో మాట్లాడించారు. ఈ దృశ్యాన్ని ఓ ప్రముఖ మీడియా ఏజెన్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నెటిజన్ల మనుసును హత్తుకుంటోంది. ‘ఇది ఎంతో విషాదకరం, తాత తొందరగా కోలుకుని బామ్మ దగ్గరకు రావాలి’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కాగా వాషింగ్టన్‌లో ఇప్పటివరకు 18 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఈ వ్యాది వల్ల ఆరుగురు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. (వేయి రోగాల పుట్టరా ఈ అరచేయి..)

చదవండి : కరోనాపై సూచనలు, ఛలోక్తులు

కరోనాతో విదేశాంగ మంత్రి సలహాదారు మృతి

మరిన్ని వార్తలు