డేంజర్‌ బెల్స్‌: ఒక్క రోజులో దాదాపు 55వేల కేసులు

20 Jun, 2020 09:18 IST|Sakshi

రియో డి జెనిరో: బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 54,771 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 10,32,913కు చేరుకుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇంతపెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా తర్వాత వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వాటిలో బ్రెజిల్‌ రెండో స్థానంలో నిలిచింది. శుక్రవారం ఒక్క రోజే.. 1,206 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య బ్రెజిల్‌లో 48,954కు చేరింది. కాగా.. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 5,07,000 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. చదవండి: కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం

ప్రస్తుతం బ్రెజిల్‌ పరిస్థితి అమెరికా కంటే దారుణంగా తయారయ్యింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాను దాటేసి బ్రెజిల్‌ త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని అంచనా. కాగా.. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఇండియాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3,95,812  కరోనా కేసులతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. అయితే.. ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 8.5 మిలియన్లకు పైగా కరోనా వైరస్ బారిన పడ్డారని.. 4,57,000 మందికి పైగా మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. చదవండి: 60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా.. 

>
మరిన్ని వార్తలు