ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్188 దేశాల్లో విస్తరిస్తూ ఇప్పటికే 55 వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. దాదాపు పదిన్నర లక్షల మంది దీని బారిన పడ్డారు. ఇక దాయాది దేశం పాకిస్తాన్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం నాటికి అక్కడ 2708 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో 1000 మందికి పైగా పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వారే కావడం గమనార్హం. పాకిస్తాన్ జాతీయ ఆరోగ్య సేవల సంస్థ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు అక్కడ 40 కరోనా మరణాలు సంభవించగా... 130 మంది కోలుకున్నారు. (దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపు)
ఇక పంజాబ్ ప్రావిన్స్ తర్వాత అత్యధికంగా సింధ్ 839, ఖైబర్ పంక్తువా 343, బలూచిస్తాన్ 175, గిల్జిత్ బల్టిస్తాన్ 193, ఇస్లామాబాద్ 75,పాక్ ఆ క్రమిత కశ్మీర్లో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తాము పటిష్ట చర్యలు చేపడతున్నా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నామంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కరోనా మహమ్మారితో పోరాడేందకు ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కు 200 మిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పాండెమిక్ రెస్పాన్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ పాకిస్తాన్ మిషన్ పేరిట కరోనాపై పోరుకు తాము సిద్ధమవుతున్నట్లు పాకిస్తాన్ రేడియో పేర్కొంది. ఇదిలా ఉండగా కరోనా సంక్షోభంతో కుదేలయిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం పేర్కొన్నారు.(కరోనా: మరో షాకింగ్ న్యూస్!)