కరోనా మృతులు లక్షలోపే: ట్రంప్‌

10 Apr, 2020 18:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ బారిన పడి మరణించే వారి సంఖ్య లక్షకు లోపలే ఉంటుందని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోజువారి వైట్‌హౌజ్‌ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దేశ ఆర్థిక రంగం కూడా త్వరలోనే కోలుకుంటుందని ఆయన చెప్పారు. ఆర్థిక రంగం పునరుద్ధరణ చర్యల కోసం కోవిడ్‌–2 టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమైన తర్వాత ప్రజలకు సామూహిక కోవిడ్‌ పరీక్షలు జరపబోమని చెప్పారు. కోవిడ్‌ మృతుల సంఖ్యను రెండు లక్షలు మించకుండా ఉన్నట్లయితే దాన్ని నిరోధించేందుకు తాము తీసుకుంటున్న చర్యలు ఫలించినట్లేనంటూ వారం క్రితం మాట్లాడిన ట్రంప్, మృతులు లక్షకు లోపలే ఉంటారని ఇప్పుడు చెప్పడం విశేషం. ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు నాలుగున్నర లక్షల మందికి ఈ వైరస్‌ సోకగా, వారిలో 15000 మంది మరణించారు. (తైవాన్ విషం చిమ్ముతోంది: చైనా)

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మాట్లాడుతూ కోవిడ్‌ను నిరోధించేందుకు తాము తీసుకుంటోన్న సామాజిక దూరం లాంటి చర్యలు విజయవంతం అవుతున్నాయని చెప్పారు. దేశ ఆర్థిక రంగం కూడా పూర్తిగా కోలుకుంటోందని అన్నారు. ముందుగా ఊహించిన దానికంటే కోవిడ్‌ రూపంలో పెద్ద దెబ్బే తగిలిందని అన్నారు. దేశ ఆర్థిక మంత్రి స్టీవ్‌ మాక్‌నూచిన్‌ మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి దేశ ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. (ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్ చీఫ్ హెచ్చరికలు)


 

మరిన్ని వార్తలు